అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ ఢిల్లీలో అమరావతి రైతులు నినాదాలు చేశారు. ఎపికి మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని కావాలంటూ శనివారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఒకే రాజధాని కోరుతూ అమరావతి రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో తమ డిమాండ్లను బలంగా వినిపించారు. ధరణికోట టూ ఎర్రకోట పేరుతో ప్రత్యేక రైలులో ఢిల్లీ చేరుకున్న రైతులు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జై అమరావతి అంటూ నినాదించారు.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఢిల్లీలో మూడు రోజుల నిరసనలకు పిలుపునిచ్చిన రైతులు. తొలిరోజు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించగా, ఆదివారం కేంద్ర పెద్దల్ని కలిసి అమరావతి సమస్యను వివరిస్తున్నారు. మూడో రోజు సోమవారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో వారు బహిరంగ సభ నిర్విహంచబోతున్నారు.
అమరావతి రైతుల ధర్నాకు టిడిపి, జనసేన, కాంగ్రెస్, సిపిఎ పార్టీల నేతలు మద్దతు పలికారు. ఆ పార్టీల నేతలు కూడా రైతులతో కలిసి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఎపికి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలోని ఆయా పార్టీల నేతలను అమరావతి నేతలు కలిసి మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వివరిస్తున్నారు.
అలాగే ఈనెల 19న ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరగనున్న భారతీయ కిసాన్ సంఘ్ ర్యాలీలో పాల్గొని అమరావతి రాజధాని వాణిని వినిపిస్తామని ఎపి రైతులు వెల్లడించారు. మరోవంక, రాజధానిగా అమరావతిని మాత్రమే ఉంచాలని కోరుతూ వారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు అమరావతి జేఏసీ నేతలు లేఖలు రాశారు.
అమరావతిని రాజధానిగా ఉంచాలని కోరుతూ మూడేళ్లుగా ఇక్కడి రైతులు ఉద్యమాలు చేస్తున్నారని, ఇందులో 200 మంది రైతులు చనిపోయారని ప్రధాని, రాష్ట్రపతి, అమిత్ షాకు రాసిన లేఖల్లో జేఏసీ పేర్కొంది. అలాగే అమరావతి ఉద్యమంపై ఇప్పటివరకూ వైసీపీ సర్కార్ 1100 దాడులు చేయించిందని అందులో పేర్కొన్నారు.
కాబట్టి ప్రధాని మోదీ వెంటనే జోక్యం చేసుకుని అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని జేఏసీ నేతలు కోరారు. తద్వారా వేలాది ఎకరాలు రాజధాని కోసం ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరారు.