టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడంకు ఎన్నికల కమీషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సంబరాలు చేసుకొంటున్న తరుణంలో కమీషన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్కు కేంద్రం ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు.
బంగారు కూలి పేరుతో టీఆర్ఎస్ నిధులు సమకూర్చుకోవడానికి సంబంధించి ఈసీకి రేవంత్ గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖకు అప్పట్లో ఈసీ లేఖ రాసింది. టీఆర్ఎస్ నిధుల కూర్పు అంశంపై విచారణ పూర్తికాకముందే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేందుకు ఈసీ అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రేవంత్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఐటీ విచారణ పూర్తి కాకముందే ఎలా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకునేందుకకు అనుమతి ఇస్తారంటూ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నెలలో బీఆర్ఎస్కు ఆమోదముద్ర వేస్తూ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్కు ఈసీ లేఖ పంపింది. ఈ లేఖపై సంతకం చేసి ఈసీకి కేసీఆర్ సమాధానం ఇవ్వడంతో టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్గా మారింది.
బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను తెలంగాణ భవన్లో పార్టీ నేతల సమక్షంలో కేసీఆర్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, నటుడు ప్రకాష్ రాజ్ కూడా హాజరయ్యారు. ఇటీవల ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, పలువురు రైతు సంఘాల నాయకులు హాజరయ్యారు.
రెండు రోజుల పాటు ఆఫీస్ ఆవరణలో కేసీఆర్ సతీసమేతంగా రాజశ్యామల యాగం చేశారు. ఈ కార్యక్రమాల్లో పలువురు మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అటువంటి తరుణంలో రేవంత్ ఈ పిటిషన్ వేయడం కలకలం రేపుతోంది.