గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబునాయుడు 2019లో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు చట్టబద్ధమేనని కేంద్రం స్పష్టం చేసింది. పైగా, రాష్ట్ర జాబితాలో ఉన్న కాపులకు రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్రం అవసరం లేదని, ఇందులో తమ పాత్ర ఏమీ లేదని బుధవారం రాజ్యసభలో కేంద్ర సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రి ప్రతిమ భౌమిక్ స్పష్టం చేశారు.
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం చేసిన చట్టం చెల్లుబాటు అవుతుందని కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరంలేదని మంత్రి ప్రతిమ భౌమిక్ వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని తెలిపారు. ఓబీసీ రిజర్వేషన్ అంశం రాష్ట్ర జాబితాలోని అంశం కాబట్టి 2019లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చేసిన చట్టం చట్టబద్ధమేనని వివరించారు.
కాగా, 2021లో చేసిన 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంత జాబితాను తయారు చేసుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు 103వ రాజ్యాంగ సవరణ చట్టం- 2019 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు గరిష్టంగా 10 శాతం రిజర్వేషన్ కల్పించవచ్చని వివరించారు.
కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోటా 10 శాతం కాగా, ఇందులో 5 శాతం కాపులకు, మిగతా 5 శాతం ఇతర అగ్రవర్ణాలకు కల్పిస్తూ బిల్లులో పేర్కొంది.