మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా శుక్రవారం నాడు ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సిఇఒ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ను సిబిఐ అరెస్టు చేసింది. వీడియోకాన్ లోన్ మోసం కేసులో వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2012లో వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ దూత్కు రుణం మంజూరులో ఐసిఐసిఐ బ్యాంక్లో తన హోదాను చందా కొచ్చర్ దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
2009 ఆగష్టులో వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ నాయకత్వంలోని.. వీఐఈఎల్ కంపెనీకి రుణాలు మంజూరు చేయడంలో అవినీతికి, అవకతవకలకు పాల్పడినట్టు నమోదైన కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. కస్టడీ కోసం వీరిద్దరికీ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే.. 2018లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో బాధ్యతల నుంచి చందా కొచ్చర్ వైదొలిగారు.
ఈ కేసులో కొచ్చర్ జంటతో పాటు వేణుగోపాల్ దూత్, ఇతరులపై సిబిఐ కేసు నమోదు చేసి, గత కొంత కాలంగా విచారణ చేపడుతోంది. వీడియోకాన్ అనుకూలంగా వ్యవహరించినందుకు గాను 2018లో బ్యాంకు సిఇఒ పదవి నుంచి చందా కొచ్చర్ వైదొలిగారు. వీడియోకాన్కు 2012లో రూ.3,250 కోట్ల రుణం మంజూరు కేసులో దర్యాప్తు చేపట్టిన ఏజెన్సీ, కొచ్చర్పై క్రిమినల్, చీటింగ్ కేసులో నిందితురాలిగా నిర్థారించింది.