తెలంగాణ టూరిజం హైదరాబాద్ నుంచి ప్రత్యేక షిరిడి టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఒక్క రోజులో షిరిడీ చూసి రావాలనుకునేవారికి ఈ టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. కేవలం రూ.2400 ధరకే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉండటం విశేషం. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీ మాత్రమే కవర్ అవుతుంది.
షిరిడీతో పాటు సమీపంలో ఉన్న ఇతర పర్యాటక ప్రాంతాలు చూడాలనుకునే వారికి వేరే టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. షిరిడీ టూర్ మొదటి రోజు హైదరాబాద్లో ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు దిల్షుక్నగర్లో టూరిజం బస్సు బయల్దేరుతుంది.
రాత్రంతా ప్రయాణం ఉంటుంది. ఉదయం 7 గంటలకు షిరిడీ చేరుకుంటారు. హోటల్లో ఫ్రెషప్ అయిన తర్వాత షిరిడీ సాయి దర్శనం ఉంటుంది. దర్శనం తర్వాత షిరిడీలోని ఇతర ఆలయాలు చూడొచ్చు. సాయంత్రం 4 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
తెలంగాణ టూరిజం షిరిడీ టూర్ ప్యాకేజీ ధర నాన్ ఏసీ బస్సులో పెద్దలకు ఒకరికి రూ.2400, పిల్లలకు ఒకరికి రూ.1,970. వోల్వో బస్సులో పెద్దలకు ఒకరికి రూ.3200, పిల్లలకు ఒకరికి రూ.2,610.
టూర్ ప్యాకేజీలో బస్సు ప్రయాణం, నాన్ ఏసీ హోటల్లో ఫ్రెషప్, షిరిడీ ఆలయ దర్శనం, ఇతర ఆలయాల్లో దర్శనం కవర్ అవుతాయి. ఫుడ్, డ్రింక్స్, ఎంట్రీ టికెట్స్ ప్యాకేజీలో కవర్ కావు. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకునే ముందు పర్యాటకులు షిరిడీ ఆలయంలో దర్శనం కోసం బుకింగ్ చేసుకోవాలి.
కాగా, ఐఆర్సీటీసీ టూరిజం కూడా తక్కువ ధరకే హైదరాబాద్ నుంచి షిరిడీకి రైల్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. సాయి శివం పేరుతో 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఐఆర్సీటీసీ షిరిడీ టూర్ ప్యాకేజీలో మొదటిరోజంతా ప్రయాణం, రెండో రోజు సాయిబాబా ఆలయ దర్శనం, మూడో రోజు నాసిక్ టూర్ ఉంటాయి.
ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.4,200. టూర్ ప్యాకేజీలో స్టాండర్డ్ ప్యాకేజీకి స్లీపర్ క్లాస్, కంఫర్ట్ ప్యాకేజీకి థర్డ్ ఏసీ ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, బ్రేక్ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.