కిషోరీ వైజ్ఞానిక్ ప్రోత్సాహణ్ యోజన (కేవీపీవై) పథకం కింద గడచిన 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్లో 564 మంది విద్యార్ధులకు ఫెలోషిప్ అందించినట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ కేవీపీవైకి ప్రత్యేకించి నిధులు కేటాయింపు ఏదీ ఉండదని, ఇన్స్పైర్, ఇన్స్పైర్-షీ బడ్జెట్ కింద కేటాయించిన నిధులతోనే కేవీపీవై ప్రోగ్రాం అమలు చేస్తారని తెలిపారు.
కేవీపీవై ఫెలోషిప్ కింద 2023-23 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 1 వరకు 843.80 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు. కిషోరీ వైజ్ఞానిక్ ప్రోత్సాహణ్ యోజన కింద 2019-20లో 17.34కోట్లు, 2020-21లో 20,71 కోట్లు, 2021-22 లో 13.45 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా పరిశోధన రంగంలో ప్రతిభ, యోగ్యత కలిగిన విద్యార్దులను అధిక సంఖ్యలో గుర్తించేందుకు కేవీపీవై ప్రోగ్రాంను (ఎస్హెచ్ఈ) స్కాలర్షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్తో అనుసంధానించినట్లు మంత్రి తెలిపారు. దీని ద్వారా ఔత్సాహికులు ప్రాథమిక, నేచురల్ సైన్స్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు చేసేందుకు ప్రతి ఏటా 12 వేల రూపాయల చొప్పున ఉపకారవేతనం లభిస్తుందని పేర్కొన్నారు.
ఇన్స్పైర్, ఇన్స్పైర్-షీ (స్కాలర్షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్) యోగ్యతను బట్టి పోటీ పరీక్షల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక జరుగుతుందని మంత్రి తెలిపారు. 6వ తరగతి నుండి 10వ తరగతిలోపు విద్యార్దులను ఆకర్షించేందుకు శాస్త్ర, సాంకేతిక విభాగం ఇన్స్పైర్ పేరిట ఒక జాతీయస్థాయి కార్యక్రమం నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు.
ఇన్స్పైర్-మానక్ కింద ప్రతి ఏటా 10 లక్షల ఐడియాలు దేశవ్యాప్తంగా మాధ్యమిక, ఉన్నత పాఠశాల నుంచి స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అందులో లక్ష ఐడియాలను ఎంపిక చేసి వాటిని ప్రతిపాదంచిన ఒక్కొక్క విద్యార్ధి బ్యాంక్ అకౌంట్లలో నేరుగా 10 వేల రూపాయలు జమ చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లా, రాష్ట్రస్థాయి ప్రదర్శనల తరువాత జాతీయస్థాయిలో 60 ఐడియాలను ఎంపిక చేసి వారికి ఇన్క్యుబేషన్ సపోర్టు అందిస్తారు. అలాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ద్వారా ప్రతి ఏటా 10 నుండి 17 సంవత్సరాల విద్యార్ధుల కోసం సైన్స్ కాంగ్రెస్లు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
