ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేసింది. ఆయనను విచారణకు పిలిపించిన సీబీఐ అధికారులు అనంతరం అరెస్ట్ చేస్తున్నట్టు తెలిపారు. సిసోడియాను దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు. సిసోడియా విచారణ, అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.
కాగా, మనీశ్ సిసోడియాకు సోమవారం మధ్యాహ్నం అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించి, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు. ఢిల్లీ ప్రభుత్వ నూతన మద్యం విధానం ఖరారు చేయడం వెనుక అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని, లిక్కర్ కుంభకోణం జరగడానికి మార్గం సుగమం చేశారని సిసోడియాపై ఆరోపణలున్నాయి.
సిసోడియా అరెస్టుతో ఆమ్ఆద్మీ పార్టీ నిరసనలు చేసే అవకాశం ఉందన్న అంచనాలతో ఢిల్లీలో పోలీసులు, కేంద్ర బలగాలతో కేంద్రం భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. ఉదయం సీబీఐ కార్యాలయానికి సిసోడియా ర్యాలీగా వెళ్లిన సమయంలోనే ఆమ్ఆద్మీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే, ఇప్పటికే కొందరు ఆప్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే.. సిసోడియాను అరెస్ట్ చేస్తారని ఆప్ వర్గాలు ముందే ఊహించాయి. సిసోడియా సైతం ఇదే భావనతో విచారణకు వెళ్లారు. కొన్ని నెలల పాటు జైల్లో ఉండేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని ఆయన పేర్కొన్నారు.
దీనిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. “దేవుడు నీకు అండగా ఉంటాడు మనీశ్. రాష్ట్రంలోని లక్షలాది పిల్లలు, వారి తల్లిదండ్రుల దీవెనలు నీకు లభిస్తాయి. ఒకవేళ నువ్వు జైలుకు వెళ్లాల్సి వస్తే అది నీ దేశం కోసం, నీ సమాజం కోసమే జైలుకు వెళుతున్నట్టు అవుతుంది. జైలుకు వెళ్లడం శాపమేమీ కాదు. నీ వంటి మంచి వ్యక్తులకు అది శోభనిస్తుంది. త్వరలోనే జైలు నుంచి తిరిగి రావాలని దేవుడ్ని ప్రార్థిస్తాను. మేమందరం నీకోసం ఎదురుచూస్తుంటాము” అని ట్వీట్ చేశారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరిన్ని రాష్ట్రాల లింకులను కూడా సీబీఐ బయటపెట్టింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితను కూడా సీబీఐ గతంలో ప్రశ్నించింది. తెలంగాణలోనూ ఈ కేసు రాజకీయ దుమారం రేపుతోంది.