రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్పై కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ క్రిమినల్ పరువునష్టం దావా వేశారు. శనివారం ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టులో ఆయన తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ పాహ్వా ఇందుకు సంబంధించిన పత్రాలు సమర్పించారు. సంజీవని క్రెడిట్ సొసైటీ కుంభకోణంలో తనకు సంబంధం ఉందంటూ గహ్లోత్ తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.
ఇందుకు ఆయనను ప్రాసిక్యూట్ చేయడంతోపాటు తనకు నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు. ఈ కుంభకోణంపై రాజస్థాన్ ప్రభుత్వం దర్యాప్తు చేయించిందని, తన పేరును ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. ఫిబ్రవరి 28న గహ్లోత్ ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రికి సంబంధం ఉందని ఆరోపణలు చేశారు.
దీనిపై గహ్లోత్ జైపూర్లో మాట్లాడుతూ తనపై దావా వేయడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. దీంతో నైనా ఈ కుంభకోణం దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుందని తెలిపారు. ఈ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన డిపాజిట్దార్లకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.
లక్ష మంది ఖాతాదార్లకు చెందిన రూ.900 కోట్లకు పైగా జీవితకాల డిపాజిట్లను దచుకున్నారని, ఇందులో కేంద్ర మంత్రికి సంబంధం ఉందని ఆరోపించారు. ఈ అవినీతిని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా పరిగణనలోకి తీసుకున్నారని చెప్పారు. దీనిపై దర్యాప్తునకు ఈడీని కోరినా స్పందన రాలేదని పేర్కొన్నారు.
రాహుల్పై పరువు నష్టం కేసు విచారణ వాయిదా
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై దాఖలైన పరువు నష్టం దావా విచారణను ఏప్రిల్ ఒకటో తేదీకి వాయిదా వేస్తూ భివాండీలోని ఫస్ట్క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేటు కోర్టు ఆదేశాలిచ్చింది. రాహుల్ విచారణకు హాజరుకాకుండా శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది దరఖాస్తు చేశా రు. దీంతో కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది. మహాత్మాగాంధీ హత్య వెనుక ఆర్ఎ్సఎస్ ఉందని 2014లో రాహుల్ తప్పుడు ఆరోపణ చేశారంటూ ఆ సంస్థ కార్యకర్త రాజేష్ కుంటే ఈ దావా వేశారు.