ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్లను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. శనివారం రాత్రి పోలీసులు వారిని ప్రయాగ్రాజ్లోని ఆస్పత్రికి మెడికల్ చెకప్కు జైలు నుండి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
మీడియాతో అతీక్, అష్రఫ్ మాట్లాడుతుండగా అకస్మాత్తుగా ముగ్గురు వ్యక్తులు వారిపై అతి సమీపం నుంచి (పాయింట్ బ్లాంక్ రేంజ్) కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరూ స్పాట్లోనే చనిపోయారు. చుట్టూ పోలీసులు కాపలా ఉన్నా వారు కాల్పులు జరిపారు.
ఈ ఘటనకు సంబంధించి ముగ్గురి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ హత్యలపై వారు ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అతీక్ అహ్మద్ గతంలో సమాజ్ వాదీ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. అంతకుముందు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ మర్డర్ కేసులో అతీక్ నిందితుడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజు పాల్ అడ్వొకేట్ అయిన ఉమేశ్ పాల్ కూడా హత్యకు గురయ్యాడు. ఈ హత్యలోనూ అతీక్ హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి.
అతనిపై మొత్తం వందకుపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. కొన్ని కేసుల్లో దోషిగా తేలాడు. కాగా, అతీక్ కొడుకు అసద్ ఈ నెల 13న ఝాన్సీలో ఎన్ కౌంటర్లో హతమయ్యాడు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 75 జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. రాజధాని లక్నోలోని హుసెయినాబాద్లో ఫ్లాగ్ మార్క్ నిర్వహించారు. మధుర, ప్రయాగ్రాజ్, అయోధ్యలో పెద్దఎత్తున పోలీసులను మోహరించారు.
కాగా, గ్యాంగ్స్టర్ హత్యపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ అత్యున్నతస్థాయి న్యాయవిచారణకు ఆదేశించారు. ముగ్గురు వ్యక్తులతో కమిటీని నియమించారు. రాష్ట్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని పిలుపునిచ్చారు. అయితే పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులు.. వారి సమక్షంలోనే దారుణ హత్యకు గురైతే రాష్ట్రంలోని సాధారణ పరిస్థితి ఏంటని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇది ముమ్మాటికి సీఎం ఆదిత్యనాథ్ ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు.
