ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో జనాభాలో చిరకాలంగా చైనా తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత భారత్ కొనసాగుతూ వస్తోంది. అయితే తాజాగా ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం చైనాను అధిగమించి జనాభాలో భారత్ తొలి స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది మధ్యలో చైనాను దాటేసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని ఐక్యారాజ్యసమితి బుధవారం తన నివేదికలో తెలిపింది.
యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్’ 2023ను తాజాగా ఐక్యరాజ్యసమితి జనాభా అధికారులు ఈ గణాంకాలను విడుదల చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం భారత జనాభా 1,428.5 మిలియన్లు లేదా 1.4286 బిలియన్లతో తొలి స్థానానికి చేరుకుంటుందని అంచనా వేసింది.
చైనా జనాభా 1.4257 బిలియన్లతో రెండో స్థానంలో ఉంటుందని, అమెరికా 340 మిలియన్ల జనాభాతో మూడో స్థానంలో ఉంటుందని అంచనా వేసింది. ఫిబ్రవరి 2023 నాటికి అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి ఈ నివేదిక తయారుచేసినట్లు ఐక్యారాజ్యసమతి జనాభా విభాగం స్పష్టం చేసింది.
గతంలో ఈ నెలలో భారత జనాభా చైనాను దాటిపోతుందని ఐక్యారాజ్యసమితి అంచనా వేసింది. అయితే తాజా నివేదికలో మాత్రం ఏ నెలలో చైనా జనాభాను భారత్ దాటుతుందనే విషయం వెల్లడించలేదు. భారత్ నుంచి వచ్చే డేటా గురించి ఆనిశ్చితి కారణంగా డేట్ను ఇప్పుడే చెప్పలేమని యుఎన్ అధికారులు తెలిపారు.
భారత్లో జనాభా లెక్కల గణన చివరిసారిగా 2011లో జరిగింది. 2021లో జరగాల్సి ..ఉండగా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడినట్లు తెలిపారు. అలాగే భారత్లో కంటే చైనాలో జనాభా పెరుగుదల బాగా మందగిస్తోందని, గత ఏడాది చైనాలో జనాభా పెరుగుదల బాగా పడిపోయిందని యూఎన్ అధికారులు తమ నివేదికలో పొందుపరిచారు.
ఇక 2011 నుంచి భారతదేశ జనాభా పెరుగుతుందని, వార్షిక జనాభా పెరుగుదల సగటున 1.2 శాతంగా ఉందని తెలిపింది. అయితే 8.045 బిలియన్ల ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ జనాభా భారత్, చైనా కలిగి ఉందని అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది మధ్యలోనే జనాభా పరంగా చైనాను భారత్ దాటేసే అవకాశముందని భారత్ ప్రభుత్వం అందించిన డేటా ప్రకారం అంచనా వేశారు. కాగా ఈ ఏడాది జనవరిలో చైనా ప్రభుత్వం తమ దేశ జనాభాను ప్రకటించింది. 1960 తర్వాత తొలిసారి చైనాలో జనాభా తగ్గడం చర్చకు దారితీసింది. ఇది అనేక మార్పులకు సంకేతమని యుఎన్ అధికారులు చెబుతున్నారు.
గత ఆరు దశాబ్దాలో తొలిసారిగా 2022లో చైనా జనాభాలో తగ్గుదల నమోదు కాగా, 2011 నుంచి భారతదేశ జనాభా ఏటా సగటున 1.2 శాతం వృద్ధి నమోదవుతున్నదని తెలిపింది. ఇక భారతదేశ జనాభాలో 0 నుంచి 14 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న వారు 25 శాతం ఉన్నారని, 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులు 18 శాతం, 10 నుంచి 24 ఏండ్ల మధ్య వయస్కులు 26 శాతం ఉన్నారని డేటా వెల్లడించింది. భారత్ లో 15 నుంచి 64 ఏండ్ల వయసు మధ్య ఉన్న వారు 68 శాతం మంది ఉన్నారని, 65 సంవత్సరాలకు పైబడిన వారు జనాభాలో 7 శాతంగా ఉన్నారని పేర్కొన్నది.