మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు తీర్పును నిలిపివేయాలన్ని ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో అనర్హత వేటు నుంచి రాహుల్ గాంధీ తప్పించుకోవడం దాదాపు అసాధ్యం.
తనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేసుకునే వరకు సమయం ఇవ్వాలని రాహుల్ గాంధీ అభ్యర్థించారు. ట్రయల్ కోర్టు రాహుల్ కఠినంగా ప్రవర్తించారని, ఎంపీ హోదాతో ఎక్కువగా ప్రభావితమయ్యారని పేర్కొంది. రాహుల్ పిటిషన్పై గత గురువారం వాదనలు పూర్తిచేసిన సూరత్ సెషన్స్ కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.
రాహుల్ తరఫు న్యాయవాది ఆర్ఎస్ చీమా వాదనలను వినిపించారు. ట్రయల్ కోర్టులో విచారణ పారదర్శకంగా జరగలేదని, గరిష్ఠ శిక్ష వేయాల్సినంత కేసు కాదని తెలిపారు. ‘సందర్భానుసారంగా సాగిన రాహుల్ ప్రసంగంలో పరువు నష్టం కలిగించేంత తీవ్రమైన వ్యాఖ్యలు లేవు.. భూతద్దంలో పెట్టి చూస్తే తప్పా.. ప్రాథమికంగా మన ప్రధానిని తీవ్రంగా విమర్శించే ధైర్యం చేసినందుకు ఆయనపై వ్యాజ్యం వేశారు’ అని ఆయన తెలిపారు.
అలాగే, ఫిర్యాదుదారుడి (పూర్ణేష్ మోదీ) భౌగోళిక అధికార పరిధిని లేవనెత్తిన చీమా రాహుల్ కోలార్లో ప్రసంగం చేశారని, వాట్సాప్లో అతడికి సందేశం వచ్చిందని చెప్పారు. ట్రయల్ కోర్టు తీర్పును రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. రెండేళ్ల జైలు శిక్షను నిలుపుదల చేయాలని.. , అలాగే తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును సైతం నిలిపివేయాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై ఏప్రిల్ 3న విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కానీ, ట్రయల్ కోర్టు తీర్పును నిలుపుదల చేయాలన్న రాహుల్ అభ్యర్థనను తిరస్కరించింది. ఇక, ట్రయిల్ కోర్టు తీర్పుతో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్వత్యాన్ని కూడా లోక్సభ సెక్రటేరియల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు.