మహిళా పోలీస్ అధికారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన తమిళనాడు మాజీ స్పెషనల్ డీజీపీ రాజేశ్ దాస్ను న్యాయస్థానం దోషిగా నిర్దారించింది. ఆయనకు మూడేళ్ల కఠిన జైలు శిక్షను విధిస్తూ విల్లుపురం కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.
ఫిబ్రవరి 2021లో మహిళా ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి పర్యటన సందర్భంగా భద్రతా విధులకు వెళ్లి సమయంలో తనపై రాజేశ్ దాస్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆమె ఆరోపించారు.
ఆమె మాజీ డీజీపీపై చేసిన ఫిర్యాదులో తనకు ఎదురైన ఇబ్బందులను తెలియజేశారు. రాజేశ్ దాస్ తన చేతిని ముద్దాడుతూ, అతడి మొబైల్ ఫోనులో తన ఫొటోలు చూపిస్తూ తన ఫేవరెట్ లిస్ట్ అని చెప్పారని ఆమె వాపోయారు. స్పెషల్ డీజీపీ అతని కారులో కూర్చుని తదుపరి మీటింగ్కు రావాలని కోరారు.
అలాగే పెరంబూర్ వరకూ డ్రాప్ చేస్తానన్నారు. సీఎం కార్యక్రమం ముగిసిన అనంతరం తామిద్దరం ఒకే కారులో సాయంత్రం 6:30కి బయలుదేరాం. ఈ క్రమంలో ఆయన కారును రెండు ప్రాంతాల్లో ఆపారు. అక్కడే తన మొబైల్లో నా ఫోటోలు చూపించి, ఫేవరెట్ లిస్ట్ ఇదని అన్నారు
దీంతో నాటి అన్నాడీఎంకే ప్రభుత్వం దాస్ను సస్పెండ్ చేసింది. దీనిపై విచారణకు ఆరుగురు సభ్యుల కమిటీని నియమించింది. విచారణ చేపట్టిన ఈ కమిటీ పోలీసులు సహా 68 మంది సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేసింది. నివేదికను కోర్టుకు సమర్పించడంతో మాజీ డీజీపీని దోషిగా నిర్దారించింది.
అయితే, తనకు తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ సభ్యుడు ఒకరు చెప్పారు. మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ స్పెషల్ డీజీపీపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.
అయితే, ఘటన తర్వాత రాజేశ్ దాస్ను వెయిటింగ్లో ఉంచడంపై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఆయనను ఇంకా ఎందుకు సస్పెండ్ చేయలేదని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఎడప్పాడి ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ మార్చి 18, 2021లో ఆదేశాలు వెలువరించింది.
ఇక, అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ఎంకే స్టాలిన్ దీనిని ఎన్నికల అంశంగా చేసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఐపీఎస్ అధికారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుని, శిక్షిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా, మాజీ స్పెషల్ డీజీపీకి కోర్టు మూడేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.