దేశ చరిత్రలో ఎమర్జెన్సీ కాలం ఓ చీకటి యుగమని, ప్రజాస్వామ్యానికి మద్దతు ఇచ్చే వారిపై అకృత్యాలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, మన ప్రజాస్వామిక సిద్ధాంతాలు అత్యున్నతమైనవని, మన రాజ్యాంగం సర్వోత్కృష్టమైనదని చెప్పారు.
మన్కీబాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాని మోదీ ఆదివారం మాట్లాడుతూ అయితే జూన్ 25 మన దేశంలో ఎమర్జెన్సీని విధించిన రోజు అని, దాన్ని ఎన్నటికీ మర్చిపోబోమని స్పష్టం చేశారు. 1975లో అప్పటి ప్రదాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే.
భారత దేశం గత కొన్నేళ్లుగా అభివృద్ధి చేసుకున్న విపత్తు నిర్వహణ సత్తా నేడు గొప్ప దృష్టాంతంగా మారిందని, బిపర్జోయ్ తుపాన్ వల్ల కచ్లో విధ్వంసం జరిగినా, ప్రజలు పరిపూర్ణ ధైర్యసాహసాలు , సర్వసన్నద్ధతతో ఎదుర్కొన్నారని ప్రధాని ప్రశంసించారు. లక్ష్యం ఎంత పెద్దదైనా, సవాలు ఎంత కఠినమైనా, భారతీయుల సమష్టి శక్తి , ఉమ్మడి బలం ప్రతి సమస్యను పరిష్కరిస్తుందని పేర్కొన్నారు.
మోదీ మన్కీబాత్ కార్యక్రమం ప్రతినెలా ఆదివారం ప్రసారమవుతూ ఉండేది. అయితే ఈనెల 21 నుంచి ప్రధాని అమెరికా, ఈజిప్టు దేశాల్లో పర్యటించబోతున్నందువల్ల ఈ 102 వ మన్కీబాత్ కార్యక్రమాన్ని ముందుగానే ప్రసారం చేశారు.
వసుధైక కుటుంబం కోసం యోగా అనేది ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాల ఇతివృత్తమని, ఒకే ప్రపంచంఒకే కుటుంబంగా అందరి సంక్షేమం కోసం యోగా అని, ఇది యోగా స్ఫూర్తిని వ్యక్తం చేస్తుందని చెప్పారు. ఇది అందరినీ అనుసంధానం చేసి, అందరూ తనను అనుసరించే లా చేస్తుందని తెలిపారు.
2025 నాటికి క్షయ వ్యాధిని నిర్మూలించాలని భారత దేశం లక్షంగా పెట్టుకుందని, గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది క్షయ రోగులను దత్తత తీసుకుంటున్నారని, ఇది భారత దేశ వాస్తవ బలమని ప్రధాని వివరించారు. ఉత్తర ప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో అంతరించిపోయిన నదిని ప్రజలు పునరుద్ధరించారని, ఈ నది మూలాధారాన్ని అమృత్ సరోవర్గా తీర్చి దిద్దారని చెప్పారు.
మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలంటే ఛత్రపతి శివాజీ మహారాజు పరిపాలనను పరిశీలించాలని , ఆయన నుంచి ధైర్యసాహసాలతోపాటు ఆయన పరిపాలన నుంచి నేర్చుకోవలసింది చాలా ఉందని చెప్పారు. ఆయన మేనేజ్మెంట్ స్కిల్ , మరీ ముఖ్యంగా నీటి యాజమాన్యం, నావికాదళం నైపుణ్యాలు, ఇప్పటికీ భారత దేశానికి గర్వకారణమని ప్రధాని వివరించారు.
నిస్సారమైన చౌడు భూములను సారవంతంగా , పచ్చదనంతో నిండిపోయేలా చేయాలంటే జపాన్ లోని మియావాకీ అనే విధానం చాలా బాగుంటుందని, ఈ టెక్నిక్ను క్రమంగా భారత దేశంలో కూడా అనుసరిస్తున్నారని ప్రధాని తెలిపారు. కేరళలో టీచర్ రాఫి రామ్నాథ్ ఈ విధానాన్ని ఉపయోగించి 115 రకాల మొక్కలతో విద్యావనం పేరుతో ఓ చిన్న అడవిని సృష్టించారని చెబుతూ ఈ చిట్కాను ఉపయోగించాలని దేశ వాసులందరినీ కోరుతున్నానని చెప్పారు.