జాతిపిత మహాత్మాగాంధీ శాంతి పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు గోరఖ్పూర్లోని ప్రఖ్యాత ప్రచురణ సంస్థ గీతాప్రెస్ ను ఎంపిక చేసింది. అహింస, గాంధేయ పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుకు గీతాప్రెస్ ప్రచురణ సంస్థను ఎంపిక చేసినట్టు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని జ్యూరీ ఈ పురస్కారానికి ఏకగ్రీవంగా గీతాప్రెస్ను ఎంపిక చేసినట్టు చెప్పింది. జాతి, కుల, మత, లింగ బేధం లేకుండా గాంధీజా బాటలో శాంతియుత మార్గంలో నవప్రపంచ నిర్మాణానికి కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు ఈ ప్రైజ్ను ఏటా అందిస్తుంటారు. ఈ పురస్కారం కింద రూ.కోటి నగదుతో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేస్తారు.
మహాత్మాగాంధీ 125వ జయంతి సందర్భంగా 1995లో భారత ప్రభుత్వం ఈ అవార్డును ఏర్పాటు చేసింది. 2019లో ఒమన్ సుల్తాన్ దివంగత ఖబూస్ బిన్ సైద్, 2020లో దివంగత బంగబంధు షేక్ ముజబుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్)కు ఈ అవార్డులను ప్రకటించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిషర్లలో ఒకటైన గీతా ప్రెస్ 1923లో ప్రారంభమైంది. 14 భాషల్లో 41.7 కోట్ల పుస్తకాలను ప్రచురించింది. వీటిలో 16.21 కోట్ల ప్రతులు భగవద్గీతపైనే ఉండటం విశేషం. గీతాప్రెస్ ఏనాడూ ఆదాయం కోసం తమ ప్రచురణల్లో అడ్వర్టైజ్మెంట్లపై ఆధార పడలేదు. అనుబంధ సంస్థలతో కలిసి మానవ జీవన ప్రమాణాలు, సమాజ శ్రేయస్సుకు ఉద్దేశించి ప్రచురణలు సాగించిన ఘనత సాధించింది.
గాంధీ శాంతి పురస్కరానికి ఎంపికైన గీతాప్రెస్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. సామాజిక సేవలో భాగంగా ప్రజల్లో సామాజిక, సంస్కృతిక పరివర్తన కోసం వందేళ్లుగా గీతాప్రెస్ చేస్తున్న కృషి శ్లాఘనీయమని ప్రశంసించారు.
