ప్రతిపక్షాల తదుపరి భేటీ బెంగళూరులో ఈ నెల 17 18 తేదీలలో జరుగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రకటించారు. బిజెపి వాషింగ్ మిషన్ ద్వారా ఇప్పుడు జరిగిన ముంబై ఆపరేషన్ పరిణామంతో ప్రతిపక్షాలు ఏకం కావాలనే సంకల్పం మరింత బలోపేతం అయిందని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో ఎన్సిపి నేత అజిత్ పవార్ పార్టీలో తిరుగుబాటుకు దిగి, మంత్రివర్గంలో చేరిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వచ్చే లోక్సభ ఎన్నికలలో బిజెపిని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలనే ఆలోచన ఇప్పుడు మరింతగా కార్యాచరణకు మారుతుందని చెప్పారు.
గత వారంలో ఎన్సిపి నేత శరద్ పవార్ ముంబైలో మాట్లాడుతూ ప్రతిపక్షాల తదుపరి సమావేశం బెంగళూరులోనే ఈ నెల 13, 14వ తేదీలలో జరుగుతుందని తెలిపారు. అయితే ఈ తేదీలలో కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ సెషన్ ఉండటంతో , అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని ఈ నెల 17 , 18 తేదీల్లో బెంగళూరులో జరిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ నేతలు వివరించారు.
పలు ప్రతిపక్ష పార్టీల తొలి భేటీ పాట్నాలో గత నెల 23న జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షాలు ఎవరికి వారేగా ఉండవని, బెంగళూరు సమావేశంతో ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలు మరింత బలోపేతం అవుతాయని టిఎంసి ఎంపి డెరెక్ ఒ బ్రెయిన్ స్పందించారు. కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్ వెలువరించిన బెంగళూరు సమ్మిట్ …ఆల్ ఫర్ ఒన్, ఒన్ ఫర్ ఆల్ను టిఎంసి నేత తమ ట్వీటుకు జతపర్చారు.
