ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై రైల్వే బోర్డుకు సేఫ్టీ కమిషన్ నివేదిక సమర్పించింది. బాలాసోర్ రైలు ఘటనకు ప్రధాన కారణం ‘రాంగ్ సిగ్నలింగ్’ అని ఉన్నత స్థాయి విచారణ కమిటీ స్పష్టం చేసింది. భద్రతా ప్రమాణాలు పాటిస్తే దుర్ఘటన జరిగి ఉండేది కాదని విచారణ కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ సందర్భంగా బహుళ స్థాయిలో జరిగిన లోపాలను ఎత్తి చూపింది.
గతేడాది సైతం ఇదే తరహా దుర్ఘటన జరిగిందని నివేదిక పేర్కొన్న సేఫ్టీ కమిషన్.. గతంలో లోపాన్ని సరి చేస్తే ప్రమాదం జరిగేది కాదని రైల్వే సేఫ్టీ కమిషన్ రైల్వే బోర్డుకు సమర్పించిన స్వతంత్ర విచారణ నివేదికలో పేర్కొంది. రాంగ్ వైరింగ్, సిగ్నలింగ్, సర్క్యూట్లో లోపాలు ప్రమాదానికి కారణమని కమిషన్ నివేదికలో తెలిపింది.
2022 మే 16న సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని ఖరగ్పూర్ డివిజన్లో రాంగ్ వైరింగ్, కేబుల్లో లోపాల కారణంగా ఇలాంటి ఘటనలే జరిగిందని కమిషన్, ఈ సంఘటన తర్వాత రాంగ్ వైరింగ్ సమస్య పరిష్కారానికి దిద్దుబాటు చర్యలు తీసుకొని ఉన్నట్లయితే బహనగ బజార్ వద్ద ప్రమాదం జరిగి ఉండేదని కాదని నివేదికలో అభిప్రాయపడింది.
సైట్లో కంప్లీషన్ సిగ్నలింగ్ వైరింగ్ రేఖా చిత్రాలు, ఇతర డాక్యుమెంట్లు, సిగ్నలింగ్ సర్క్యూట్ల అక్షరాలను అప్డేట్ చేసేందుకు ఓ డ్రైవ్ను ప్రారంభించాలని, మార్పుల కోసం ప్రామాణిక పద్ధతులను అనుసరించాలని సూచించింది. సిగ్నలింగ్ సర్క్యూట్లు, పనితీరును తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా బృందాన్ని నియమించాలని సూచించింది.
అయితే, ఇలాంటి విపత్తులు జరిగిన సమయంలో ప్రతిస్పందన వేగంగా ఉండాలని, జోనల్ రైల్వేల్లో విపత్తు ప్రతి స్పందన వ్యవస్థను సమీక్షించాలని, ఎన్డీఆర్ఎఫ్ వంటి వివిధ విపత్తు ప్రతిస్పందన దళాల మధ్య సమన్వయాన్ని సమీక్షించాలని రైల్వేలకు సూచించాలని నివేదిక పేర్కొంది.
ఇదిలా ఉండగా.. జూన్ 2న బాలాసోర్ బహనగ బజార్ వద్ద జరిగిన ప్రమాదంలో 292 మంది మరణించగా, వేయి మందికిపైగా గాయపడ్డారు. దేశంలోనే అతిపెద్ద రైలు ప్రమాదంగా నిలువగా, ఘటనలో మృతి చెందిన వారిని గుర్తిస్తున్నారు. దాదాపు 50 వరకు ఇంకా మృతులను గుర్తించాల్సి ఉంది. డీఎన్ఏ నమూనాలను సేకరించి మృతుల ఆచూకీ తెలుసుకునేందుకు రైల్వేశాఖ ప్రయత్నిస్తున్నది.