భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెండు సార్లు కక్ష్యను నౌక విజయవంతంగా పెంచగా, మంగళవారం మరోసారి మూడోసారి కక్ష్యను (ఎర్త్ బౌండ్ ఆర్బిట్ మ్యాన్యువర్) పెంచినట్లు ఇస్రో తెలిపింది. బెంగళూరు నుంచి ఈ విన్యాసాన్ని నిర్వహించినట్లు పేర్కొంది.
ప్రస్తుతం చంద్రయాన్-3 భూమికి 41,603 కిమీ x 226 కిమీ దూరంలో ఉన్న భూ కక్ష్యలో ఉందని ఇస్రో వివరించింది. ఈ నెల 20న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమయంలో మరోసారి ఇంజిన్ను బర్న్ చేసి కక్ష్యను పెంచనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా, చంద్రయాన్ నౌక భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నది.
ప్రతి కక్ష్యతో శాటిలైట్ దూరాన్ని పెంచే ప్రక్రియ కొనసాగుతున్నది. చంద్రయాన్-3 భూమికి దగ్గరగా ఉండగా, చంద్రుడికి వైపు వెళ్లడానికి ఇంజిన్లను మళ్లీ బర్న్ చేసి వరుసగా ఆటిట్యూడ్ను పెంచే ప్రక్రియ కొనసాగుతున్నది.
ఇది భూమి నుంచి చంద్రుడి వైపు మళ్లిన తర్వాత, చంద్రయాన్ 3లోని ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రునిపై అంతరిక్ష నౌక ఎత్తును తగ్గించడానికి మళ్లీ ఇలాంటి ప్రక్రియ చేపట్టి ల్యాండ్ అయ్యేందుకు వేగాన్ని తగ్గించనున్నారు. ఇక చంద్రయాన్-3 స్పేస్క్రాఫ్ట్ వచ్చే నెల 5 నాటికి చంద్రుడి కక్షలోకి చేరుకుంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఆ తర్వాత ల్యాండింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా.. ఇస్రో జులై 14న చంద్రయాన్-3 మిషన్ను విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. చంద్రుడిపైకి ఇస్రో పంపిన మూడో మిషన్ ఇది. చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ విజయవంతమైతే, భారత్ విజయం సాధిస్తే ప్రపంచంలోనే నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఈ ఘనత సాధించాయి.