భారీ వర్షాల కురుస్తుండడంతో గుజరాత్ అతలాకుతలమైంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోత వానలతో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. శనివారం రాత్రి కురిసిన వర్షానికి అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నీట మునిగింది. జునాగఢ్ జిల్లాలో భారీ వరద ప్రవాహంలో కార్లు, పశువులు కొట్టుకుపోయాయి.
ఈ క్రమంలో కారు కోసం వెళ్లి కుటుంబ సభ్యుల కళ్ళ ముందే వరదల్లో కొట్టుకుపోయాడు. మరోవైపు నవ్సారి పట్టణంలో గ్యాస్ సిలిండర్లు వరదల్లో కొట్టుకుపోయాయి. కాగా, గుజరాత్ లో భారీ వర్షాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో రాష్ట్రంలోని పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
అహ్మదాబాద్ ఎయిర్పోర్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టెర్మినల్ ఏరియాలతోపాటు రన్వే పైకి కూడా వరద నీరు వచ్చి చేరింది. దాంతో ప్రయాణికులు సమయానికి తమ ఫ్లైట్ను చేరుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు.
మోకాళ్ల లోతు నీళ్లలో ప్రయాణికులు అటూ ఇటూ నడవాల్సి వస్తున్నది. అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరద పరిస్థితిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఎయిర్పోర్టులోంచి వరద నీటిని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
గత 28 ఏళ్లలో అహ్మదాబాద్ ఎయిర్పోర్టును వరదలు ముంచెత్తడం ఇదే తొలిసారని వారు తెలిపారు. ఇదిలావుంటే గత 48 గంటల నుంచి గుజరాత్లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాంతో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి.
మరోవంక, యమునా నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నది. ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది ప్రవాహం 205.75 మీటర్లకు చేరింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో హర్యానాలోని హత్నికుండ్ బరాజ్ నుంచి ప్రభుత్వం 2 లక్షలకుపైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో దిగువన ఉన్న న్యూఢిల్లీకి మళ్లీ వరద పోటెత్తింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ముంపు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం వెల్లడించింది.
కాగా, జూలై 25 వరకు హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతవరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఢిల్లీకి మరింత వరద ముప్పు పొంచి ఉన్నట్లయింది.
అయితే గత కొన్ని రోజులుగా ఢిల్లీలో యమునా నది 205.33 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం నదీ ప్రవాహం ప్రమాద స్థాయికి తగ్గినప్పటికీ మళ్లీ పెరగడంతో అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నెల 13న యమునా నది 208.66 మీటర్లు ప్రవహించింది. అనంతరం క్రమంగా తగ్గుతూ వస్తున్నది.