తెలంగాణ వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం పోరాటం మరింత ఉధృతం చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి వెల్లడించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో శనివారం బిజెపి మహాధర్నా నిర్వహించింది. జిహెచ్ఎంసితో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు.
ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 23, 24వ తేదీల్లో జిల్లా కలెక్టరేట్ల ముందు. సెప్టెంబరు 4న హైదరాబాద్లో విశ్వరూప ధర్నా ఉంటుందని ప్రకటించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తారా.. గద్దె దిగుతారా? అని ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీశ్రేణులకు ఆయన పిలుపునిస్తూ 18న అన్ని మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాలని, ఈ నెల 23, 24వ తేదీల్లో జిల్లా కలెక్టరేట్ల ముందు. సెప్టెంబరు 4న హైదరాబాద్లో విశ్వరూప ధర్నా ఉంటుందని ప్రకటించారు.
బిఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేపర్లపైనే ఉంటాయని, భూమి మీద ఉండవని కేంద్ర మంత్రి విమర్శించారు. పేదలకు ఇళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని 2018లో ముఖ్యమంత్రి అన్నారని గుర్తుచేశారు. ‘ప్రగతిభవన్ ను 4 నెలల్లో, సచివాలయాన్ని 8 నెలల్లో కట్టుకున్నారు. పేదలకు ఇచ్చే ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. పేదలకు ఇళ్లు కడితే.. కేంద్రం వాటా తీసుకొచ్చే బాధ్యత నాది అని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలు మార్పును కోరాలని, బిజెపికి ఒక అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోందని, వరదలు వచ్చి చనిపోయిన వారి కుటుంబాలను కనీసం పరామర్శించ లేదని కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ నెల 16, 17 తేదీల్లో ప్రతి ఒక్కరూ బస్తీల సందర్శనకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
దళితబంధు పేరుతో దళితులను, నిరుద్యోగ భృతి పేరుతో విద్యార్థులను దగా చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వస్తాయి. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే పేదలకు ఇక ఎప్పుడూ ఇళ్లు రావు. ఎన్నికల ముందు గృహలక్ష్మి పేరిట మరోసారి మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంచే దమ్ము సిఎం కెసిఆర్కు లేదని బిజెపి ఎంఎల్ఎ ఈటల రాజేందర్ విమర్శించారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదు లక్షల మంది ఇళ్లు లేని పేదలు ఉన్నారని, ఆంధ్రప్రదేశ్లో వైసిపి ప్రభుత్వం 20 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో మాత్రం లక్ష ఇళ్లు కూడా కట్టలేదన్నారు. ఐదు వేలకు పైగా ఎకరాల అసైన్డ్మెంట్ ల్యాండ్ పేదల నుంచి కెసిఆర్ లాక్కున్నారని ఈటల ఆరోపణలు చేశారు. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని ఈటల డిమాండ్ చేశారు.
మహాధర్నా కార్యక్రమంలో ఎంపి ధర్మపురి అర్వింద్, మాజీ ఎంపిలు జితేందర్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డి, విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కూన శ్రీశైలంగౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రదీప్కుమార్, బంగారు శృతి తదితరులు పాల్గొన్నారు.