సుమారు 50 ఏండ్ల తర్వాత రష్యా చేపట్టిన మూన్ మిషన్ ఫెయిల్ అయ్యింది. అది పంపిన లూనా-25 ప్రోబ్ చంద్రుడిపై కూలిపోయింది. తమ అంతరిక్ష నౌక చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టిందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ ఆదివారం తెలిపింది. శనివారం లూనా-25తో కమ్యూనికేషన్ తెగిపోయినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ల్యాండర్ నియంత్రణ కోల్పోవడంతో చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టినట్టు వెల్లడించింది.
కాగా, ఆగస్ట్ 11న రష్యా ప్రయోగించిన లూనా-25 రెండు రోజుల కిందట చంద్రుడి వద్దకు చేరుకున్నది. అయితే ఆ స్పేస్క్రాఫ్ట్లో సాంకేతిక లోపం ఏర్పడింది. అంతకుముందు శనివారం మధ్యాహ్నం 2.57 గంటలకు లూనా 25 తో.. తమకు సంబంధాలు తెగిపోయాయని రోస్కాస్మోస్ తెలిపింది. దీంతో వెంటనే చర్యలు చేపట్టామని.. ప్రాథమిక పరిశోధనల ప్రకారం ల్యాండర్ చంద్రుని ఉపరితలంతో ఢీకొన్న తర్వాత ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొంది.
ఈ క్రమంలోనే లూనా 25 స్పేస్క్రాఫ్ట్ కూలిపోయినట్లు ప్రకటించింది. చంద్రుడి దక్షిణ ధృవం వద్ద ఉపరితలాన్ని ఢీకొట్టిందని రోస్కాస్మోస్ ఆదివారం వెల్లడించింది. మరోవైపు భారత్ పంపిన చంద్రయాన్-3 ల్యాండర్ను చంద్రుడి దక్షిణ ధృవం వద్ద సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో మరో రెండు రోజుల్లో ప్రయత్నించనున్నది.
అయితే చంద్రుడిపై పరిశోధనలకు సంబంధించిన ప్రయోగాల గురించి రోస్కాస్మోస్ చీఫ్ యూరి బోరిసోవ్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు వివరించారు. ఇలాంటి ప్రయోగాలు చాలా ప్రమాదకరమని.. దాదాపు 70 శాతం మాత్రమే సక్సెస్ అయ్యాయని తెలిపారు. లూనా 25 స్పేస్క్రాఫ్ట్ ఏడాది పాటు చంద్రునిపై ఉండి, అక్కడ నమూనాలను సేకరించడం.. మట్టిని విశ్లేషించి పరిశోధనలు చేయడం వంటివి చేసేందుకు పంపించారు. లూనా 25 స్పేస్క్రాఫ్ట్ ల్యాండర్పై ఏర్పాటు చేసిన కెమెరాలు స్పేస్ నుంచి భూమి, చంద్రుని ఫొటోలను తీసి ఇప్పటికే భూమికి పంపించాయి.