మరి కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో 2024లో లోక్సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అ సెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని లా కమిషన్ స్పష్టం చేస్తున్నది. దీంతో 2029నుంచి లోక్సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడానికి ఓ ఫార్ములాను రూ పొందిస్తున్నట్లు లా కమిషన్ వర్గాలు వెల్లడించాయి.
వివిధ రాష్ట్రాల శాసనసభల కాలపరిమితిని కుదించడం, లేదా పెంచడం ద్వారా ఒకే సారి ఎన్నికల నిర్వహణకు సిఫార్సులు చేస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. కాగా లోక్సభ, అ సెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఉమ్మడి ఎన్నికల జాబితా ఉండేలా చూడడానికి లా కమిషన్ ఓ యంత్రాంగాన్ని రూపొందిస్తున్నట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం లోక్సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు ఓటర్ల జాబితాలను రూపొందిస్తున్నారు. ఒకే రకమైన పనిని కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు వేర్వేరుగా నిర్వహించడం వల్ల ఖర్చుతో పాటుగా సిబ్బంది వినియోగం లాంటివి ఎక్కువ అవసరం అవుతున్నాయి.
ఒకే ఓటరు జాబితాను రూపొందించడం వల్ల ఖర్చుతో పాటు సిబ్బంది వినియోగం గణనీయంగా తగ్గుతుంది. అయితే ఈ విషయాలు బయటికి వచ్చినప్పటికీ కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం కానందున దీనిపై లా కమిషన్ తుది నివేదికను సిద్ధంచేయలేదని తెలుస్తోంది.
పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించవచ్చని లా కమిషన్ భావిస్తోందని, ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించే పనిలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించడానికి ఉన్న మార్గాలను అన్వేషించడం ప్రస్తుత లా కమిషన్ విధి.
జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ ఉన్నతస్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తొలి సమావేశం నిర్వహించిన ఈ కమిటీ దేశంలో పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు అన్ని స్థాయిల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలన్న యోచనపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయించింది.
ఈ దృష్టా లోక్సభ, రాష్ట్రాల అసెం బ్లీ ఎన్నికలతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడాన్ని చేరుస్తూ లా కమిషన్ పరిధిని కూడా విస్తృత పరిచే అవకాశం లేకపోలేదదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒక ఏడాదిలో రెండు దశల్లో మూడంచెల ఎన్నికలను నిర్వహించవచ్చనే సూచనను లా కమిషన్ చేయవచ్చని తెలుస్తోంది.
మొదటి దశలో లోక్సభ, అసెంబ్లీల ఎన్నికలు, రెండో దశలో స్థానిక సంసల ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ సూచించవచ్చని తెలుస్తోంది. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒకో రకమైన వాతావరణ పరిస్థితులు ఉన్న దృష్ట్యా ఇది ఆచరణీయమైన వైఖరిగా ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే, ఏకకాల ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని లా కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ రుతురాజ్ అవస్థి ఇటీవల పేర్కొన్నారు. ఈ అంశంపై నివేదిక సమర్పణకు తుది గడువు అంటూ ఏమీ లేదన్నారు. పోక్సోచట్టం, ఆన్లైన్ ఎఫ్ఐఆర్లపై నివేదికలను న్యాయశాఖకు పంపించినట్లు వెల్లడించిన ఆయన జమిలి ఎన్నికలపై ప్రస్తుతం కసరత్తు కొనసాగుతోందని తెలిపారు.