చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల చరిత్రలోనే తొలిసారి 100 పతకాలను గెలిచింది. మహిళల కబడ్డీలో శనివారం భారత జట్టు స్వర్ణం గెలుచుకోవడం ద్వారా ఈ మార్కు అందుకుంది. ఫైనల్ పోరులో భారత మహిళల జట్టు చైనీస్ జట్టును ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది.
చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోరులో భారత్ 26-25తో గెలిచింది. మొదటి 20 నిమిషాల్లో భారత్ జట్టు 14-9తో అధిక్యంలో నిలిచింది. అయితే సెకండాఫ్లో చైనా ప్లేయర్లు రాణించడంతో 39 నిమిషాలు ముగిసే సమయానికి రెండు జట్లు 24-24తో సమంగా నిలిచాయి.
చివరి నిమిషంలో ఒత్తిడిని అధిగమిస్తూ మన అమ్మాయిలు అదరగొట్టడంతో 26-25తో భారత్ అధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో గెలుపు మన సొంతమైంది. కాగా ఈ సారి ఆసియా క్రీడల్లో 100 పతకాలు గెలడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసింది.
కాగా శుక్రవారం వరకు భారత్ 95 పతకాలు గెలిచింది. నేడు ఇప్పటికే మరో 5 పతకాలను గెలిచింది. అందులో ఆర్చరీలోనే 4 పతకాలు వచ్చాయి. ఆర్చరీ మహిళల విభాగంలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ బంగారు పతకం గెలిచింది.
ఆర్చరీ కాంపౌండ్ ఇండివిడ్యూవల్ ఫైనల్ పోరులో దక్షిణ కొరియాకు చెందిన సో చే-విన్పై జ్యోతి విజయకేతనం ఎగురువేసింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో జ్యోతి 149-145తో గెలిచింది. కాగా తాజా పతకం ఈ ఆసియా క్రీడల్లో జ్యోతికి మూడవది కావడం విశేషం. ఇప్పటికే ఆమె కాంపౌండ్ ఉమెన్స్ టీమ్, కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగాల్లో కూడా పతకాలు గెలిచింది.
అలాగే ఆర్చరీ కాంపౌండ్ ఇండివిడ్యూవల్ విభాగంలో నేడు అదితి గోపిచంద్ కాంస్య పతకం గెలిచింది. మరోవైపు ఆర్చరీ పురుషుల విభాగంలో ఓజాస్ డియోటేల్ కూడా స్వర్ణం గెలిచాడు. ఇదే విభాగంలో అభిషేక్ రజతం కైవసం చేసుకున్నాడు.
దీంతో ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు గెలిచిన పతకాల సంఖ్య 100కు చేరింది. ఇందులో 25 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్య పతకాలున్నాయి. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. కాగా గతంలో ఇండోనేషియా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 70 పతకాలను గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సారి ఆ రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా 100 పతకాలు గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.
