మరాఠా కోటా ఉద్యమంతో మహారాష్ట్ర రగులుతున్నది. విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళనకారులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. జాతీయ రహదారులు, రైల్వే ట్రాకులను దిగ్బంధించారు. పలు చోట్ల ప్రభుత్వ, బీజేపీ కార్యాలయాలకు నిప్పుపెట్టారు.
పుణే, శివగావ్, అహ్మద్నగర్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. పుణే- బెంగళూరు రహదారిపై ఆందోళనకారులు టైర్లకు నిప్పుపెట్టారు. ముంబై-బెంగళూరు హైవేను రెండు గంటలపాటు దిగ్బంధించటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఈ లోగా, మరాఠా సామాజిక వర్గానికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆమరణ దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త మనోజ్ జరంగే తన దీక్షను విరమించారు. జల్నా జిల్లాలోని అంతర్వాలీ సారతిలో చేపట్టిన ఆయన దీక్ష ఏడో రోజుకు చేరిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే మంగళవారం ఫోన్ చేసి మాట్లాడారు.
మరాఠా రిజర్వేషన్లపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్ వర్తించేలా కున్బీ సర్టిఫికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన హామీతో సంతృప్తి చెందిన మనోజ్ దీక్ష విరమించారని సీఎంవో ప్రకటన విడుదల చేసింది.
మరాఠాలకు కున్బీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ మంగళవారమే ప్రారంభించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడం తమ ప్రభుత్వ బాధ్యత అని షిండే చెప్పారు. మరాఠా రిజర్వేషన్ల కోసం సామాజిక కార్యకర్త మనోజ్ అక్టోబరు 25న ఆమరణ దీక్ష ప్రారంభించిన తర్వాత మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.
రిజర్వేషన్ల అంశంపై ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మరాఠా ఎమ్మెల్యేలు మంత్రాలయలోని నారిమన్ పాయింట్ వద్ద ఆందోళన చేపట్టారు. షోలాపూర్లో సామాజిక కార్యకర్తలు రైలు పట్టాలను దిగ్బంధించారు.
జల్నా జిల్లా ఘన్సావంగి వద్ద కొందరు వ్యక్తులు పంచాయతీ సమితి కార్యాలయానికి నిప్పుపెట్టారు. హింగోలి జిల్లాలో బీజేపీ కార్యాలయాన్ని ఆందోళనకారులు తగులబెట్టారు. కాగా, మరాఠ్వాడా ప్రాంతంలోని మరాఠాలకు కుంబీ కుల సర్టిఫికెట్స్ జారీ చేయాలంటూ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సందీప్ షిండే కమిటీ ఇచ్చిన నివేదికకు మహారాష్ట్ర సర్కార్ మంగళవారం ఆమోదం తెలిపింది.
కుంబీ కుల సర్టిఫికెట్స్ జారీ ప్రారంభిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రిజర్వేషన్లపై గతంలో తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు 2021లో కొట్టేసింది. దాంతో మరాఠా కమ్యూనిటీ ప్రజలకు ప్రభుత్వం కుంబీ సర్టిఫికెట్లు ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనపై సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన జల్నాలో విలేకరులతో మాట్లాడుతూ, ‘ఇది అసంపూర్ణమైన రిజర్వేషన్. దీనిని ఎంతమాత్రమూ ఒప్పుకోం. రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి చట్టాన్ని చేయాలి’ అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మరాఠాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారని, రాష్ట్రమంతటా వర్తించేలా రిజర్వేషన్లు ప్రకటించాలని జరాంగే డిమాండ్ చేశారు. మరాఠాలోని కొన్ని వర్గాలకు మాత్రమే వర్తించేలా రిజర్వేషన్లు కల్పించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రిజర్వేషన్ల కోసం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, గ్రామాల్లోకి రాకుండా రాజకీయ నాయకులను అడ్డుకోవటం కొనసాగిస్తాం’ అని ప్రకటించారు.
సోమవారం ఆందోళనకారులు ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లతోపాటు మజల్గావ్లో మునిసిపల్ కౌన్సిల్ భవనానికి నిప్పు పెట్టారు. మరాఠా కోటాకు మద్దతు తెలుపుతూ ఇద్దరు శిందే వర్గానికి చెందిన సేన ఎంపీలు, ఓ ఎమ్మెల్యే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేశ్ వార్పుడ్కర్, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పవార్ కూడా రాజీనామా చేశారు.