ముంబయిపై దశాబ్దం కిందట జరిగిన ఉగ్రదాడిని తాను మర్చిపోలేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం మన్ కీ బాత్ లో నవంబర్ 26, 2008 ముంబయిలో జరిగిన ఉగ్రదాడి ఘటనని ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ “ముంబయి ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య. ఉగ్రవాదులు అప్పట్లో దేశాన్ని వణికించారు. ప్రస్తుతం భారత్ వారిని అణచివేయడానికి అన్ని కఠిన చర్యలు చేపట్టింది” అని చెప్పారు.
ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ ముంబయి దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఆ రోజు 10 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు విధ్వంసకర ఆయుధాలతో ముంబయిలో వరుస దాడులు చేశారు. ఈ దాడులు పౌరులు, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నాయి.
అరేబియా సముద్రం మీదుగా నగరంలోకి చొరబడిన ఉగ్రవాదులు 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మందిని హతమార్చగా, వందలాది మంది గాయపడ్డారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. ఛత్రపతి శివాజీ టర్మినస్ రైల్వే స్టేషన్, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, నారిమన్ హౌస్ జ్యూయిష్ కమ్యూనిటీ సెంటర్తో సహా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎకె -47 రైఫిల్స్, గ్రనైడ్లతో ఉగ్రదాడులు జరిగాయి.
ఈ దాడుల్లో మరణించిన వారిలో అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబయి అదనపు పోలీసు కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ సలాస్కర్ ఉన్నారు. దాడులు చేసిన పది మంది ఉగ్రవాదుల్లో తొమ్మిది మందిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మనుగడలో ఉన్న ఒక ఉగ్రవాది, అజ్మల్ కసబ్ను అరెస్టు చేసి నవంబర్ 21, 2012న ఉరితీశారు.
దేశంలోని కొన్ని ఉన్నత కుటుంబాలు విదేశాల్లో వివాహ వేడుకలు చేసుకోవడాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ ఈ వేడుకలను భారత్లోనే చేసుకువాలని వారికి విజ్ఞప్తి చేశారు. అందువల్ల దేశంలోని సొమ్ము దేశాన్ని వీడి వెళ్లదని స్పష్టం చేశారు. వివాహాల కోసం షాంపింగ్ చేసేటప్పుడు ఇండియాలో తయారైన ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
”పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ సీజన్లో రూ.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని కొన్ని వాణిజ్య సంస్థలు అంచనా వేస్తున్నాయి. పెళ్లిళ్ల కోసం షాపింగ్కు వెళ్లినప్పుడు దేశవాళీ ఉత్పత్తుల కొనుగోలుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి” అని మోదీ కోరారు.
”వివాహాల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఒక అంశం నన్ను చాలా కాలంగా ఇబ్బంది పెడుతోంది. నా మనసులోని ఆవేదన నా కుటుంబ సభ్యులకు కాకుండా ఎవరికి చెబుతాను?. ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. కొందరు పెద్ద కుటుంబాల వారు విదేశాలు వెళ్లి అక్కడ వివాహాలు చేసుకుంటున్నారు. అంత అవసరం ఉందా?” అని మోదీ ప్రశ్నించారు.