కాంగ్రెస్ ప్రభుత్వానికి మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఒవైసీని ఎంపిక చేశారని చెబుతూ సీనియర్ ఎమ్మెల్యేలను కాదని ఏ ప్రాతిపదికన నియమించారని నిలదీశారు.
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీని ఆదరించారని చెబుతూ ఒక్క స్థానం నుంచి 8 సీట్లకు పెరిగి 6 నుంచి 14 శాతానికి పార్టీ ఓటు బ్యాంకు పెరిగిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు ప్రకారం శాసనసభ గౌరవాన్ని కాల రాసిందని మండిపడ్డారు.
మజ్లిస్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ పార్టీ వ్యక్తిని ప్రొటెం స్పీకర్గా చేసిందని చెబుతూ అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ చేయడాన్ని బిజెపి వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. అనేక మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అక్బరుద్దీన్ను ప్రొటెం స్పీకర్గా చేయడంపై మండిపడ్డారు. ప్రొటెం స్పీకర్ సమక్షంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయరని స్పష్టం చేశారు.
ఈ అంశంపై గవర్నర్కు కూడా ఫిర్యాదు చేశామని చెబుతూ స్పీకర్ ఎన్నికను ఆపాలని డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తరువాతే బిజెపి ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మినా దగ్గినా పడిపోతుంది అందుకే మజ్లిస్ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తోందని ఎద్దేవా చేశారు.