బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. బాత్రూమ్లో జారిపడటంతో తుంటి ఎముక విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ను సీఎం రేవంత్రెడ్డి ఆదివారం పరామర్శించారు.
హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్ రెడ్డి కేసీఆర్ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఆయన అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని అభిప్రాయపడ్డారు.
వారి సూచనలు, సలహాలు ప్రభుత్వానికి అవసరమని చెప్పారు. కేసీఆర్ కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. కాగా కేసీఆర్ను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో సీఎం రేవంత్రెడ్డి వెంట మంత్రి సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా ఉన్నారు. వారి కంటే ముందు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సీఎంను పరామర్శించి వెళ్లారు.
కాగా, తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం కేసీఆర్ కోలుకుంటున్నారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది. వైద్యులు వాకర్ సాయంతో ఆయనను నడిపించారు.