అధిష్ఠానంపై ధిక్కారస్వరం వినిపించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గీతదాటిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్లకు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, గుంటూరు జిల్లాకు చెంది ఉండవల్లి శ్రీదేవితో సహా ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ యాదవ్, సి.రామచంద్రయ్యపై ఫిర్యాదు చేసింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ విప్ను ధిక్కరించి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి ప్రత్యర్థికి ఓట్లు వేసిన విషయం తెలిసిందే. వీరిని ఇప్పటికే పార్టీ నుంచి సీఎం జగన్ సస్పెండ్ చేశారు. ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ ఇటీవలే జనసేన పార్టీలో చేరారు.
ఇక, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో కలిసిన సంగతి తెలిసిందే. టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన సి.రామచంద్రయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మళ్లీ కోలుకోలేని విధంగా ఏపీని జగన్ అప్పులపాలు చేశారని విమర్శించారు. ఏమి చేసినా జగన్ చేసిన అప్పులు తీరవని, ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి ఆయన చెప్పినా వినే పరిస్థితి లేదని బాహటంగా ధ్వజమెత్తారు.