ఆరు గ్యారంటీల అమలుకోసం ప్రజా పాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఇప్పుడు అమలు దిశగా కసరత్తు ప్రారంభించింది. దీని కోసం తాజాగా మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
వంద రోజుల్లోగా పథకాల అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో దరఖాస్తులకు ఆధార్, రేషన్ కార్డు అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.
సబ్ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వ్యవహరించనున్నారు. ప్రజాపాలనపై సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించారు.
ఎన్నికల హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని మంత్రులు ప్రకటించారు. డిసెంబర్ 28 నుంచి ఈ నెల 6 వరకు ప్రజాపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 1,24,85,383 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఐదు పథకాల కోసం 1,05,91,636 దరఖాస్తులు రాగా, రేషన్ కార్డులు, తదితర అంశాలపై 19,92,747 దరఖాస్తులు వచ్చాయి.
దరఖాస్తుల ఎంట్రీలో తప్పులు లేకుండా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. డేటా ఎంట్రీ తరువాత కేబినెట్, సబ్ కమిటీలో చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసి అమలు చేస్తామని చెప్పారు.
ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుందని వెల్లడించారు. ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్ లైన్ లో పొందుపరుస్తామని చెప్పారు. దరఖాస్తు పత్రాలను ఆధార్, రేషన్ లింక్ చేస్తామని వెల్లడించారు.