ప్రముఖ జైన దిగంబర ముని ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ శనివారం తనువు చాలించారు. ఛత్తీస్గఢ్లోని చంద్రగిరి జైన దేవాలయంలో విద్యాసాగర్ మహారాజ్ శనివారం అర్థరాత్రి 2:35 గంటలకు తన దేహాన్ని విడిచిపెట్టారు. దీనికి ముందు ఆయన ఆచార్య పదవిని వదులుకున్నారు.
మూడు రోజులపాటు ఉపవాసం ఉంటూ, మౌనం పాటించారు. అనంతరం ప్రాణాలు విడిచారు. విద్యాసాగర్ మహారాజ్ మరణవార్త తెలియగానే జైన సమాజానికి చెందిన పలువురు చంద్రగిరి జైన దేవాలయానికి చేరుకున్నారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
విద్యాసాగర్ మహరాజ్ గురువు జ్ఞాన్ సాగర్ మహరాజ్ కూడా తన 77వ ఏట చంద్రగిరి తీర్థంలోనే సజీవంగా సమాధిలోకి వెళ్లి మూడు రోజులకు దేహాన్ని విడిచారు. సజీవ సమాధికి మూడు రోజుల ముందే విద్యాసాగర్ మహరాజ్కు జ్ఞాన్ సాగర్ మహరాజ్ జైనమత గురువు స్థానాన్ని కట్టబెట్టారు. అప్పటికి విద్యాసాగర్ మహరాజ్ వయసు 26 ఏండ్లు.
ఇప్పుడు విద్యాసాగర్ మహారాజ్ కూడా సజీవ సమాధికి ముందు తన శిష్యుల్లోంచి ఒకరిని తదుపరి ఆచార్యగా ప్రకటించారు. నిర్యాపక శ్రామన్ ముని సమయ్సాగర్కు ఆచార్య హోదాను కట్టబెట్టారు. విద్యాసాగర్ మహరాజ్ 1946 అక్టోబర్ 10న కర్ణాటక రాష్ట్రం బెల్గాం జిల్లాలోని సదల్గా గ్రామంలో జన్మించారు.
గత ఏడాది నవంబర్ ఐదున ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. తన ఆలోచనలు, ప్రార్థనలు ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహారాజ్ జీ యొక్క అసంఖ్యాక భక్తులతో ఉన్నాయని తెలిపారు. సమాజానికి ఆయన చేసిన అమూల్యమైన కృషికి, ముఖ్యంగా ప్రజలలో ఆధ్యాత్మిక జాగృతికి ఆయన చేసిన కృషి, పేదరిక నిర్మూలన, వైద్యం, విద్య, మరిన్నింటి కోసం ఆయన చేసిన కృషికి రాబోయే తరాలు గుర్తుండిపోతాయని అంటూ నివాళులు అర్పించారు.
“ఇన్నాళ్లకు ఆయన ఆశీస్సులు అందుకున్న ఘనత నాకు దక్కింది. గత ఏడాది చివర్లో ఛత్తీస్గఢ్లోని డోంగర్ఘర్లోని చంద్రగిరి జైన మందిరాన్ని సందర్శించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సమయంలో, నేను ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహారాజ్ జీతో గడిపాను మరియు వారి ఆశీస్సులు కూడా పొందాను.”అంటూ ప్రధాని ఎక్స్ద్వారా ట్వీట్ చేశారు.