బిఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావు, మాజీ ఎంపీలు గొడెం నగేష్, సీతారాం నాయక్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, ఓబిసి మోర్చా అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ లు పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు.
వాస్తవానికి వీరు ముందుగానే పార్టీ మారుతారని తెలిసినా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల నుంచి ఎలాంటి స్పందన లేక పోవడం గమనార్హం. కాగా, హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన సైదిరెడ్డి టీఆర్ఎస్ లో కీలక నాయకుడు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
ముఖ్యంగా కె టి ఆర్ కు అంత్యంత సన్నిహితుడిగా సైదిరెడ్డికి పేరుంది. ఆయన పార్టీ మారేందుకురెడీ అవుతున్నట్టు తెలిసినా కేటీఆర్ మౌనంగా ఉన్నారు. కనీసం ఫోన్ చేసి వారించే ప్రయత్నం కూడా చేయలేదు. అంతేకాదు ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదు. దీంతో సైదిరెడ్డి పార్టీ మారారు.
ఇక జలగం వెంకట్రావు ఖమ్మం జిల్లాలో కీలక నేత. మాజీ ముఖ్యమంత్రి అయినా జలగం వెంగళరావు, తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి 2004లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై 9,536 ఓట్ల తేడాతో గెలుపొందాడు.
2009లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేతిలో 2,472 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు 16,521 ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా గెలిచాడు.
2014లో ఖమ్మం జిల్లా నుండి గెలిచిన తొలి, ఏకైక టిఆర్ఎస్ శాసనసభ్యుడు.2018లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో 4,120 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అఫిడవిట్ కేసులో ఆయన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు 2023 జులై 25న తీర్పును వెల్లడించింది. దీంతో 2018లో ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకటరావును కోర్టు ఎమ్మెల్యేగా ప్రకటించింది.
అయితే, 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దాంతో అసంతృప్తిలో ఉన్న జలగం వెంకట్రావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరే కాదు రానున్న రోజుల్లో మరికొందరు నేతలు సైతం బీజేపీలో చేరుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరిన సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పని ఖతం అయిపోయిందన్నారు. తెలంగాణలో గతంలో కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎలాంటి ఆరోపణలు లేకుండా మోడీ ప్రభుత్వం దేశం కోసం పని చేస్తోందని తెలిపారు.