గుజరాత్లోని సూరత్ లోక్సభ బరిలో కాంగ్రెస్ తరుఫున నిలబడ్డ అభ్యర్థి నీలేశ్ కుంభని కనిపించట్లేదని స్థానిక మీడియా తెలిపింది. రేపోమాపో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు వెల్లడించింది. దీంతో కుంభని ఇంటిముందు చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు ‘ప్రజాద్రోహి’ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సూరత్
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కుట్రలకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. కాగా, సూరత్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ నామినేషన్ తిరస్కరణకు గురవడం, నామినేషన్ల చివరి రోజు మిగతా అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తూ ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించడం తెలిసిందే.
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం ఏకగ్రీవంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారితో తమ పార్టీనే సంప్రదింపులు జరిపి, నామినేషన్లు విత్డ్రా చేసుకునేలా చేసిందని వెల్లడించారు.
మంగళవారం ముంబైలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ రాజకీయంగా దిగజారిందన్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. ‘స్వతంత్ర అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకోవాలని అభ్యర్థించాం. వారు ఉపసంహరించుకున్నారు. ఇందులో దిగజారిపోవడం ఏముంది?’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఇతర అభ్యర్థులనూ బీజేపీ సంప్రదించిందా అని ప్రశ్నించగా.. అవునని ఆయన పేర్కొన్నారు.
గుజరాత్లో అధికార బిజెపి “అనవసరమైన ప్రభావం” చూపిందని ఆరోపిస్తూ, ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభించాలని కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. “కాబట్టి సూరత్లో ఎన్నికలను వాయిదా వేయాలని, ఎన్నికలను మళ్లీ నిర్వహించాలని మేము ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించాము, మీరు ఈ రకమైన తప్పుడు అనవసరమైన ప్రభావాన్ని ఉపయోగించుకోలేరనే స్పష్టమైన సందేశాన్ని పంపాలి” అని పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఎన్నికల కమిషనర్లను కలిసిన తర్వాత విలేకరులతో పేర్కొన్నారు. .