ఎనిమిదేళ్ల వయసులోనే ధైర్యంగా ఓ ఉగ్రవాదిని ఎదిరించి మాట్లాడింది. ఆర్మీ క్వార్టర్స్లో చొరబడి దాడి చేస్తున్న పాకిస్థాన్ జైషే మహ్మద్ ఉగ్రవాదికి ముఖాముఖీ మాట్లాడి. తన తల్లి, ఇద్దరు చెల్లెళ్లతో పాటు క్వార్టర్స్లో ఎన్నో ప్రాణాలను కాపాడింది. అప్పటికే ఆ ఉగ్రవాది చేసిన గ్రనేడ్ దాడిలో గాయపడినా చెక్కు చెదరని ధైర్యంతో నిలిచి గంటపైగా మాట్లాడి అతడిని దాడి ఆపేలా ఒప్పించింది.
అక్కడి నుంచి తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఒప్పించింది. సురక్షితంగా కొంత దూరం వెళ్లాక తెలివిగా ఆర్మీ జవాన్లకు సమాచారం ఇచ్చి, ముష్కరుల అంతం చూసింది. ఈ చిన్నారి చూపిన తెగువ, ధైర్యానికి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పుస్కారానికి ఎంపికైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అవార్డును అందుకోవడంతో పాటు ఆయన ప్రశంసలు కూడా పొందింది.
ఈ వీర బాలిక పేరు గులుగు హిమ ప్రియ. ఈ చిన్నారి తండ్రి గులుగు సత్యనారాయణ ఆర్మీలో హవల్దార్గా పని చేస్తున్నారు. వీరి స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం కాగా.. 2018 సమయంలో జమ్ములోని ఉధంపూర్లో పని చేస్తుండేవారు. ఆ ఏడాది ఫిబ్రవరి 8న తెల్లవారు జామున, వాళ్లు ఉంటున్న సుంజువాన్ ఆర్మీ రెసిడెన్షియల్ క్వార్టర్స్పై జైషే మహ్మద్ ఉగ్రవాదులు దాడి చేశారు.
అయితే ఆ సమయంలో తండ్రి సత్యనారాయణ ఇంట్లో లేడు. ఉధంపూర్లో డ్యూటీకి వెళ్లారు. ఉగ్రవాదులు ఒక్కో ఇంటిపై దాడి చేస్తూ హిమ ప్రియ వాళ్ల ఇంటి వరకు వచ్చారు. అయితే అప్పటికే వాళ్లను లోపలికి రాకుండా అడ్డుకునేందుకు తన తల్లి పద్మావతి పిల్లల్ని ఒక గదిలో ఉంచి, తలుపుకు ఫర్నీచర్ అంతా అడ్డుగా నిలిపింది. ఉగ్రవాది లోపలికి వెళ్లడం కుదరకపోవడంతో హ్యాండ్ గ్రనేడ్ విసిరాడు.
దీంతో పద్మావతికి తీవ్ర గాయాలై స్పృహతప్పి పడిపోయింది. చిన్నారి హిమ ప్రియకు కూడా భుజానికి గాయమైంది. అయినప్పటికీ ధైర్యంగా ముందడుగు వేసింది. తన తల్లిని, చెల్లెళ్లను కాపాడుకునేందుకు ఉగ్రవాదికి ఎదురు నిలిచే సాహసం చేసింది. తలుపు తెరిచి ఆ ఉగ్రవాదితో మాట్లాడ సాగింది.. వాదించింది. ఎట్టకేలకు తన దారికి తెచ్చుకుంది.
తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అతడు ఒప్పుకునేలా చేసింది. తన చెల్లెళ్లతో పాటు తల్లిని వెంటబెట్టుకుని బయట పడింది. ఆ తర్వాత తనకెందుకులే అనుకోకుండా ఆర్మీ జవాన్లకు సమాచారం అందించి ఉగ్రవాదుల పనిబట్టేలా చేసింది. మొత్తానికి క్వార్టర్స్లో వీలైనన్ని ప్రాణాలను కాపాడేలా చేశాయి హిమ ప్రియ ధైర్య సాహసాలు. ఈ ధీరత్వాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ఆ చిన్నారిని 2022కు గానూ రాష్ట్రీయ బాల పురస్కారాలకు ఎంపిక చేసింది.
ఆ పురస్కారాన్ని 12 ఏళ్ల హిమ ప్రియ వర్చువల్గా ప్రధాని నుంచి అందుకుంది. ఈ చిన్నారితో పాటు మొత్తం 29 మంది రాష్ట్రీయ బాల పురస్కారాలను అందుకున్నారు. ఇందులో హైదరాబాద్కు చెందిన బాలుడు తేలుకుంట విరాట్ చంద్ర కూడా ఉన్నాడు. ఏడేళ్ల వయసులో ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా కిలిమాంజారో పర్వతాన్ని అధిరోహించినందుకు గానూ విరాట్ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.