మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్పించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను బుధవారం రాత్రి 10.30 గంటలకు ఎయిమ్స్లోని పాత ప్రైవేట్ వార్డులో చేర్చారు. అద్వానీకి యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి.
యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అమలేష్ సేథ్ ఆధ్వర్యంలో ఆయన చికిత్స పొందుతున్నారు. అద్వానీ మెడికల్ బులెటిన్ను ఎయిమ్స్ వైద్యులు, వైద్య నిపుణులు త్వరలో విడుదల చేయనున్నారు. కేంద్ర ఆరోగ్యమంత్రి జెపి నడ్డా ఆసుపత్రికి చేరుకొని అద్వానీ ఆరోగ్యం గురించి కుటుంభం సభ్యులు, ఐయిమ్స్ డైరెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, పరిశీలనలో ఉన్నారని వైద్యులు చెప్పారు.
ప్రస్తుతం అద్వానీ వయస్సు 96 ఏళ్ల కాగా.. ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు ప్రత్యేక వార్డులో ఉంచి ఎయిమ్స్ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వృద్ధాప్య సమస్యలకు సంబంధించిన విభాగానికి చెందిన వైద్యుల బృందం పర్యక్షేణలోకి ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎల్కే అద్వానీ దేశ అత్యున్నత పౌర గౌరవ పురస్కారమైన భారతరత్నను ఈ ఏడాది 2024లోనే స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎల్కే అద్వానీ నివాసానికి వెళ్లి భారతరత్నతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా పాల్గొన్నారు. అద్వానీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన నివాసంలోనే ఆయనకు భారతరత్నను ప్రదానం చేశారు.
కాగా, బీజేపీ పార్టీ అద్వానీ అత్యంత సీనియర్ నేత. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. 1927 నవంబర్ 8న కరాచీ (ప్రస్తుత పాకిస్థాన్)లో జన్మించిన అద్వానీ.. 1942లో స్వయం సేవక్ సంఘ్లో చేరారు. బీజేపీకి అత్యధిక కాలం జాతీయ అధ్యక్షుడిగా పని చేశారు. 1986-1990 వరకు, 1993-1998 వరకు, 2004 -2005 వరకు అద్వానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సేవలందించారు.
అటల్ బిహారీ వాజ్పేయూ ప్రధానిగా ఉన్న సమయంలో 1999-2004 వరకు కేంద్ర హోం మంత్రిగా పనిచేశారు. 2002-2004 మధ్య ఉప ప్రధానమంత్రిగానూ సేలవందించారు. అంతకు ముందు మొరార్జీ దేశం ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఆయన్ను ప్రధాని మంత్రి అభ్యర్థిగా ప్రకటించగా.. ఆ ఎన్నికల్లో యూపీఏ విజయం సాధించింది.