బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ తో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తప్పుకున్నారు. తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్ నుంచి తప్పుకుంటున్నట్టు సుప్రీంకోర్టుకు జస్టిస్ నరసింహా రెడ్డి లేఖ పంపారు. దీంతో ఆయన స్థానంలో మరొకరి నియామకానికి అత్యున్నత న్యాయస్థానం సమయం ఇచ్చింది.
ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే కొత్త జడ్జి నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగించొచ్చని పేర్కొంది. సోమవారం లోపు కొత్త చైర్మన్ను నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో కేసీఆర్ పిటిషన్పై విచారణ ముగిస్తున్నట్లు సీజేఐ ప్రకటించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నర్సింహారెడ్డితో జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కమిషన్ విచారణను సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు మంగళవారం ఉదయం విచారణ చేపట్టింది.
ఇరుపక్షాల తరపున సీనియర్ న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ మనుసింఘ్వీ, సిద్ధార్థ్ లూథ్రా, కేసీఆర్ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. ఈ వాదనల అనంతరం విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ చైర్మన్ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్మీట్ నిర్వహించడంపై కోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. కమిషన్ను మార్చాలని కోర్టు ఆదేశించింది. మధ్యాహ్నం 2 గంటల లోపు నూతన చైర్మన్ పేరును వెల్లడిస్తామని పేర్కొంది. భోజన విరామం అనంతరం తదుపరి విచారణ కొనసాగిస్తామని కోర్టు తెలిపింది.
అయితే భోజన విరామ సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విద్యుత్ ఒప్పందాలపై విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు ఓ న్యాయవాది ద్వారా జస్టిస్ నర్సింహారెడ్డి సుప్రీంకోర్టుకు లేఖ పంపారు.
