సీఎం కేసీఆర్ కారణంగా నల్గొండ పట్టణంలో 5 ఎకరాల్లో ఉన్న నీలగిరి నందనవనం ధ్వంసమవుతోందని బిజెపి సీనియర్ నేత, మరి ఎంపీ విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదిలో ఒకటి, రెండు సార్లు కూడా వస్తారో రారో తెలియని సీఎం హెలీప్యాడ్ కోసం అధికారులు వనాన్ని నాశనం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
సీఎం కేసీఆర్ హరితహారం పేరుతో వేల చెట్లను నాటించినట్టు చెప్పుకుంటారని, కానీ ఆ సీఎం కారణంగానే ఒక ఉద్యానవనం ధ్వంసం అవుతోందని ఆమె ధ్వజమెత్తారు. దానికి దగ్గర్లో 150 ఎకరాల భూములున్నా కేవలం జిల్లా కలెక్టరేట్ పక్కనే హెలిప్యాడ్ ఉండాలనే ఒకే ఒక్క కారణంతో సుమారు 30 ఏండ్ల నాటి 300 చెట్లు నరికేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక ఎకరం ఉంటే సరిపోయే హెలీప్యాడ్ కోసం జనావాసాల మధ్య తెలుగు విశ్వవిద్యాలయం నిర్మాణానికి కేటాయించిన రెండెకరాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చెందిన మరో మూడెకరాలు స్వాధీనం చేసుకున్నారని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. నీలగిరి నందనవనంలోని మూడెకరాల్లో వేప, మద్ది, దిరిసెన తదితర చెట్లు పట్టణ ప్రజలను దశాబ్దాలుగా ఆహ్లాదపరుస్తున్నయని ఆమె పేర్కొన్నారు.
కానీ కొద్దిరోజులుగా వీటితో పాటు తెలంగాణ హరితహారంలో భాగంగా ఈ ఆవరణలో లక్షలు ఖర్చుపెట్టి నాటిన మొక్కల్ని కూడా తొలగిస్తున్నరని ఆమె మండిపడ్డారు. హెలీప్యాడ్ నిర్మించడానికి పట్టణ పరిసర ప్రాంతాల్లో వందల ఎకరాల్లో ఖాళీ స్థలం ఉందని, ఎస్ఎల్బీసీ వద్ద సుమారు 150 ఎకరాలుండగా, దీంట్లో ప్రభుత్వ భవనాలకు వంద ఎకరాలు కేటాయించారని ఆమె తెలిపారు.
అయినప్పటికీ ఇందులో ఇంకా 50 ఎకరాల వరకు ఖాళీగా ఉందని, కానీ నీలగిరి నందనవనాన్ని నరికేసి అక్కడే హెలీప్యాడ్ నిర్మించడానికి అధికారులు మొగ్గు చూపుతున్నరని ఆమె దుయ్యబట్టారు. హరితహారంతో ఎంతో చేశామని చెప్పుకునే కేసీఆర్ దగ్గర దీనికి జవాబుందా? అని ఆమె ప్రశ్నించారుఇప్పటికైనా ఈ విధ్వంస కాండను ఆపాలని విజయశాంతి డిమాండ్ చేశారు.