కాశ్మీర్ లోయలో లక్షిత దాడులు జరిగిన్నప్పుడల్లా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అత్యున్నత స్థాయి సమావేశం జరిపినట్లు వార్తలు వస్తున్నాయని అంటూ అటువంటి సమావేశాలు ఇక చాలని, దాడులు ఆపడానికి ఓ కార్యాచరణ ప్రణాలికను ప్రకటించండి అంటూ ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
“1990 యుగం మళ్లీ వచ్చింది. వారికి (ప్రభుత్వానికి) ఎలాంటి ప్రణాళిక లేదు. లోయలో హత్య జరిగినప్పుడల్లా, హోంమంత్రి అత్యున్నత స్థాయి సమావేశాన్ని పిలిచారని వార్తలు వస్తున్నాయి, ఈ సమావేశాలు సరిపోతాయి, ఇప్పుడు మాకు చర్య కావాలి, కాశ్మీర్ చర్య కావాలి, ”అని స్పష్టం చేశారు.
జమ్మూ కాశ్మీర్లో లక్షిత హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వాటికీ నిరసనగా దేశ రాజధానిలోని ‘జంతర్ మంతర్’ వద్ద ‘ఆప్’ నిర్వహించిన `జన్ ఆక్రోశ్ ర్యాలీ’ని ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగిస్తూ లోయలో కాశ్మీరీ పండిట్లకు భద్రత కల్పించడంలో బిజెపి పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
కాశ్మీర్ సమస్యను బిజెపి పరిష్కరించలేదని, నీచరాజకీయాలకు పాల్పడటమే బిజెపి తెలుసునని మండిపడ్డారు. హత్యలకు నిరసనగా ఆందోళన చేపట్టేందుకు కూడా కాశ్మీరీ పండిట్లను అనుమతించడం లేదని, వారి ఇళ్లలోనే వారిని బంధిస్తున్నారని, వారి హక్కులను హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“వారు (కాశ్మీరీ పండిట్లు) లక్షిత హత్యలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నప్పుడు, కాశ్మీర్లోని ప్రస్తుత బిజెపి ప్రభుత్వం వారికి నిరసన తెలియజేయడానికి అనుమతించదు. ప్రభుత్వం ఇలాగే ప్రవర్తిస్తే ప్రజల కష్టాలు రెట్టింపు అవుతాయి’’ అని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్ పండితుల విషయంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
లోయలో జరిగిన లక్షిత హత్యలపై కేజ్రీవాల్ కేంద్రానికి నాలుగు డిమాండ్లు చేశారు – అలాంటి సంఘటనలను ఆపడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక, కాశ్మీర్ వెలుపల పనిచేయబోమని కాశ్మీర్ పండిట్లు సంతకం చేసిన బాండ్లను రద్దు చేయాలి, కాశ్మీరీ పండిట్ల డిమాండ్లను నెరవేర్చాలి, వారికి భద్రత కల్పించాలి.
ఈ సందర్భంగా చిన్నచిన్న టాక్టిక్స్ మానుకోవాలని కేజ్రీవాల్ పాకిస్థాన్ను హెచ్చరించారు. “కాశ్మీర్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగమే” అని ఆప్ అధినేత స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో గత కొన్ని నెలలుగా పౌరుల హత్యలు పెరిగాయి – మూడు నెలల్లో 13 మంది కాల్చి చంపారు. ఈ విషయంపై శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింఘా, ఎన్ఎస్ఎ అజిత్ దోవల్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆప్ ఎంపి సంజయ్సింగ్ మాట్లాడుతూ.. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా పేరుతో ప్రధాని, హోంమంత్రి, కేంద్రమంత్రులు, ఎంపీలందరూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు.“ఈరోజు కాశ్మీరీ పండిట్లను ఊచకోత కోస్తున్నారు. మీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఎక్కడ దాక్కున్నారని నేను మోదీని అడగాలనుకుంటున్నా’’ అని సింగ్ ఎద్దేవా చేశారు.