రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డిఎ అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం ద్వారా ఈ అత్యున్నత పదవికి తొలిసారి ఓ గిరిజన మహిళ చేరుకొనే అవకాశాన్ని బిజెపి కలిగించింది. ఇప్పటి వరకు గిరిజనులు ఎవరు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి అత్యున్నత అడవులను చేపట్టలేదు.
ఢిల్లీలో మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం జరిగిన బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా. నితిన్ గడ్కరీ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
సమావేశంలో దాదాపు 20 మంది పేర్లను పరిశీలించిన అనంతరం ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అనేక మంది పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ రాష్ట్రపతిగా ఎస్టి మహిళను చేయాలని నిర్ణయించినట్లు నడ్డా తెలిపారు. ద్రౌపది ముర్ము విశేష ప్రతిభా శాలి అని, వివాద రహితురాలని చెప్పారు. మంత్రిగా, గవర్నర్గా ఆమె రాణించారని పేర్కొన్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించిన కొద్ది గంటలకే అధికార ఎన్డిఎ కూటమి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం గమనార్హం.
ఒక వేళ ఎన్నికయితే 64 ఏళ్ల ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి గిరిజన మహిళ అవుతారు. అంతేకాదు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ అత్యున్నత పదవికి ఎన్నికైన మొదటి వ్యక్తి కానున్నారు. ఇప్పటివరకు పనిచేసిన రాష్ట్రపతులు అందరూ స్వాతంత్రంకు పూర్వం జన్మించిన వారే.
ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము గతంలో జార్ఖండ్ గవర్నర్గా పని చేశారు. గవర్నర్గా అయిదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న ద్రౌపది ముర్ము 2000లో రాయ్ రంగాపూర్ ఎంఎల్ఎగా గెలిచారు. రాష్ట్ర బిజెపి ఎస్టి శాఖ అధ్యక్షురాలిగా పని చేశారు. ఒడిశా రవాణా శాఖ మంత్రిగా కూడా ఆమె పని చేశారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు ఆమె టీచర్గా పని చేశారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడపోసిలో ద్రైపది ముర్ము జన్మించారు.
వాస్తవానికి ద్రౌపది ముర్ము కిందటి సారే రాష్ట్రపతి కావలసింది. అయితే చివరి క్షణంలో బిజెపి నేతలు రామ్నాథ్ కోవింద్ పేరుకు మద్దతు తెలపడంతో ముర్ముకు ఆ అవకాశం దక్కలేదు. చదువు తర్వాత కొంత కాలం ప్రభుత్వ ఉద్యోగం చేసిన తర్వాత ముర్ము ఉద్యోగానికి గుడ్బై చెపి రాజకీయాల్లోకి ప్రవేశించారు. బిజెపి, బిజెడి ప్రభుత్వాల్లో రెండు సార్లు మంత్రిగా పని చేశారు.
ఒడిశాలో అత్యంత వెనుకబడిన సంతాల్ గిరిజన జాతికి చెందిన ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం ద్వారా రాబోయే లోక్సభ ఎన్నికల్లో గిరిజనులను తమ వైపు తిప్పుకోవాలన్నది బిజెపి వ్యూహంగా కనిపిస్తోంది. అంతేకాదు ఇటు గిరిజన వర్గానికి అవకాశం కల్పించడంతో పాటుగా అటు మహిళకు అవకాశం ఇచ్చిఆ రెండు వర్గాల ఓటు బ్యాంక్ను తమ వైపు తిప్పుకోవడం బిజెపి ఆలోచనగా కనిపిస్తోంది.