ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలను ఆయా రాజకీయ పార్టీలే నియంత్రించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై స్పందన తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది.
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అవి ఇస్తాం.. ఇవి ఇస్తామంటూ ఉచిత హామీలు ఇవ్వడాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇలాంటి హామీలు ప్రమాదకరంగా అభివర్ణించింది. వీటిని నిరోధించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఉచితాల కోసం రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది, బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ పిల్ దాఖలు చేశారు. దీనిపై జనవరి 25వ తేదీన సీజేఐ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
మంగళవారం దీనిపై విచారణ జరిపింది. హామీలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఉన్నాయనే విషయాన్ని సుప్రీం గుర్తు చేసింది.ఈ విషయంలో ఎన్నికల సంఘం ఏమీ చేయలేదా? అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది.
దీనిపై అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఉచిత హామీలను నియంత్రించే అధికారం తమకు లేదని పేర్కొంది. ఉచిత పథకాలతో రాష్ట్రాలపై ఆర్థిక ప్రభావం ఎలా ఉంటుందని ఓటర్లే నిర్ణయించుకోవాలని న్యాయస్థానానికి తెలిపింది.
ఉచితాలపై నిషేధం విధించే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకరావాల్సి ఉంటుందని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఉచిత హామీలపై ఈసీనే ఓ నిర్ణయం తీసుకోవాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ తెలిపారు. రాతపూర్వకంగా ఎందుకు ఇవ్వకూడదని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రశ్నించారు. ప్రభుత్వం తన వైఖరి తెలిపితే వీటిని కొనసాగించడమా ? లేదా ? అనేది తాము నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.
కాగా, ఈ విషయమై సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ను ప్రశ్నించారు. సీనియర్ న్యాయవాదే కాకుండా సీనియర్ పార్లమెంటేరియన్ గా ఉన్నారని, దీనిని నియంత్రించడానికి ఎలాంటి సలహా ఇస్తారని ప్రశ్నించారు. రాజకీయ అంశాలు ఇమిడి ఉండడం వల్ల ఉచితాలపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంటుందని తాను భావించడం లేదని కపిల్ సిబల్ స్పష్టం చేశారు.
మొత్తం రూ 6.5 లక్షల కోట్ల అప్పు ఉందని, భారత్ కూడా మరో శ్రీలంక అవుతుందని పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ్ కోర్టుకు తెలిపారు. ఉచిత పథకాలపై రాష్ట్రాలు వెచ్చించే మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఆయా రాష్ట్రాలకు రెవెన్యూ కేటాయింపులను నియంత్రించవచ్చా? అనే అంశాన్ని ఫైనాన్స్ కమిషన్ను అడిగి తెలుసుకోవాలని కోర్టు కేంద్రానికి సూచించింది.
ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఉచిత పథకాలను ప్రకటించి కొన్ని పార్టీలు రాష్ట్రాలను నాశనం చేస్తున్నాయని విమర్శించిన విషయం తెలిసిందే.