ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీకి ఎనిమిదేళ్లు పూర్తి అయింది. అయినా ఆయనకు ప్రజాదరణ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రజాదరణతో ఆయనకు సమీపంలో జాతీయ స్థాయిలో మరే నాయకుడు కూడా లేరు. తాజాగా ఇండియాటుడే- సీ ఓటర్ నిర్వహించిన సంయుక్త సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
గత రెండేళ్లుగా దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం ఓవైపు, మరోవైపు కరోనా సంక్షోభం, పెట్రోల్ ధరల మంట తదితర సమస్యలతో ఎన్డీఏ నేతృత్వంలోని ప్రభుత్వం సతమతమవుతోంది. అయినా ప్రధానిగా నరేంద్ర మోదీకి ప్రజాదరణ మాత్రం తగ్గలేదు. 53 శాతం మంది ప్రజలు తదుపరి ప్రధాన మంత్రిగా తిరిగి నరేంద్ర మోదీ కొనసాగాలని కోరుకుంటున్నారని తాజా సర్వేలో వెల్లడైంది.
మోదీ తర్వాత స్థానాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి 9 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లి సీఎం అరవింద్ కేజ్రీవాల్కు 7శాతం మంది మాత్రమే ప్రధానిగా ఆమోదం తెలిపారు. మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి.
ప్రధాని మోదీ నాయకత్వంవైపే అత్యధికులు మొగ్గుచూపుతారని, కానీ 2019లో వచ్చిన సీట్ల కంటే ఈసారి బీజేపీకి కొద్దిగా సీట్లు తగ్గుతాయని పేర్కొంది. గత ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు చేజిక్కించుకోగా, ఈసారి 286 సీట్ల వరకు వచ్చే అవకాశముందని సర్వే వెల్లడించింది.
అయితే కాంగ్రెస్ బలం మరింత ఇనుమడిస్తుందని, గత ఎన్నికల్లో 52 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్, ఇప్పుడు 146 వరకు సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని ఇండియాటుడే – సీ ఓటర్ సర్వే వివరించింది. ఆగష్టు 1 నాటికి ఎన్డీయేకు 307 సీట్లు, యుపిఎకు 125 సీట్లు వస్తాయని అంచనా వేయగా, బీహార్ లో నితీష్ కుమార్ ఎన్డీయే నుండి నిష్క్రమించడంతో ఈ అంచనాను కొద్దిగా సవరించారు.
ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్ర బాగుందని 40శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. 34 శాతం మంది మాత్రమే బాగాలేదని పెదవి విరిచారు. ఆధునిక కాంగ్రెస్కు రాహుల్గాంధీ అయితేనే సరైన వ్యక్తి అని 23 శాతం మంది అభిప్రాయపడ్డారు. 16 శాతం మంది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, 14 శాతం సచిన్ పైలట్ అయితే బాగుంటుందని పేర్కొన్నారు.
కేవలం 9 శాతం మంది మాత్రమే ప్రియాంక గాంధీ వాద్రా వైపు మొగ్గు చూపారు. ఇండియా టుడే- సీ ఓటర్ సంస్తలు ఈ సర్వేని ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆగస్టు మధ్యలో చేపట్టాయి. ఈ ఏడాది ఆరంభంలోనూ ఇలాంటి సర్వేనే ఇండియా టుడే చేపట్టింది. అప్పటికి, ఇప్పటికి పెద్దగా మార్పేమీ కనిపించలేదు.