కేసీఆర్ పై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పోయిందని, ఆయన్ను సాగనంపడానికి ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ విశ్వాసం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వీఆర్ఎన్ గార్డెన్స్ లో జరిగిన బీజేపీ లోక్ సభ ప్రవాస్ యోజన కోర్ కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తోందని, కేసీఆర్ కుటుంబం చేతిలో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడి, బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని ఆయన పిలుపిచ్చారు.
నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్లు అంటూ కేసీఆర్ ఎన్నో హామీలిచ్చారని, కానీ ఇప్పటివరకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు.
పంట నష్టపోవడం వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్న మంత్రి ఫసల్ బీమాను అమలు చేయకుండా కేసీఆర్ రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా మోడీ ప్రభుత్వం రైతులకు ఆర్ధిక సహాయం అందిస్తోందని గుర్తు చేశారు.
ఫ్రీ రేషన్ ద్వారా దేశంలోని పేదలందరి ఆహార భద్రత ను కల్పించిందని చెబుతూ రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో ప్రధాని మోడీ ఫోటోలు పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం నేరుగా లబ్దిదారులకు చేరుతోందని, దీనికి జన్ ధన్ ఖాతాలు బాగా ఉపయోగపడుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. దేశ రక్షణ విషయంలో మోడీ ప్రభుత్వం దృఢంగా పనిచేస్తోందన్నారు.
యూపీఏ ప్రభుత్వంలో రూ.4 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్న మంత్రి, అవినీతి రహిత పాలనే ధ్యేయంగా మోదీ ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రధాని మోదీ తీసుకున్న చర్యలు అమోఘమని, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 200 డోసుల వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రంలో అమలు కాకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.
బీజేపీ అభివృద్ధి పథకాలను తెలంగాణలో పూర్తిస్థాయిలో అమలు చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద కోట్లాది మంది పేదలు ఇళ్లు నిర్మించుకుంటున్నారని తెలిపారు.