అరుదైన వన్యప్రాణులైన చీతాలు (చిరుతపులుల్లో ఒక రకం) దాదాపు 74 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్లో అడుగుపెట్టాయి. మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్లో చీతా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం తన పుట్టిన రోజున ప్రారంభించారు.
నమీబియా లోని విండ్హాక్ నుంచి భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ 17 హెలికాప్టర్లలో కునే నేషనల్ పార్కుకు వీటిని శనివారం ఉదయం తీసుకొచ్చారు. ఈ 8 చీతాలను ప్రత్యేక ప్రత్యేక క్వారంటైన్ ఎన్క్లోజర్ లోకి విడుదల చేశారు. అనంతరం ఆయనే స్వయంగా కెమెరా చేతపట్టి వాటి ఫోటపోలు తీశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని వెంట మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ ఎనిమిది చిరుతలు మన అతిధులని, కునో నేషనల్ పార్కు వీటి ఇల్లని, వీటిని తీసుకురాడానికి ప్రభుత్వం అనేక సంవత్సరాల నుంచి కృషి చేస్తోందని చెప్పారు.
దీని వెనుక ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర అమృతోత్సవాలను జరుపుకొంటున్న సమయంలో వీటిని తీసుకువచ్చామని, నూతన శక్తితో వీటిని పరిరక్షిస్తామని పేర్కొన్నారు. ఇది చరిత్రాత్మక దినమని చెప్పారు. మనదేశం గతంలో ఆసియాటిక్ చిరుతలకు నిలయంగా ఉండేదని గుర్తుచేశారు.
దశాబ్దాల కిందట జీవవైవిధ్యపు పురాతన బంధం తెగిపోయింది. ఈరోజు తిరిగి ఆ బంధాన్ని అనుసంధానిస్తున్నాం. చిరుతలతోపాటు ప్రకృతిని ప్రేమించే చైతన్యంతో భారత్ పూర్తిశక్తితో మేల్కొంది. భారతీయులతోపాటు నమీబియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. ప్రత్యేక విమానంలో ఆ చీతాలు ఆఫ్రికా నుంచి గ్వాలియర్కు శనివారం ఉదయమే చేరుకున్నాయి. ఆ తర్వాత వాటిని ప్రత్యేక హెలికాప్టర్లలో కూనో ఫారెస్ట్కు తరలించారు.