నిర్ణయాత్మక మూడో టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా అద్భుతంగా రాణించి శ్రీలంకపై ఘనవిజయం సాధించి టీ20 సిరీస్ శైవసం చేసుకుంది. శ్రీలంకకు 229 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించి, లంక జట్టును 137 పరుగులకు ఆలౌట్ చేసింది. 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అద్భుత శతకంతో కదంతొక్కిన సూర్యకుమార్ యాదవ్ (112 రన్స్, 51 బంతుల్లో, 9 సిక్స్లు, 7 ఫోర్లు) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యాడు.
‘360 డిగ్రీస్ ప్లేయర్’గా గుర్తింపు తెచ్చుకున్న సూర్యకుమార్ రాజ్కోట్లో మరోమారు తన బ్యాట్ పవర్ చూపాడు. బౌలర్తో సంబంధం లేకుండా తన అమ్ములపొదిలోని అన్ని అస్ర్తాలను సమర్ధవంతంగా వినియోగించుకున్న సూర్య.. తన చిన్న కెరీర్లోనే టీ20ల్లో మూడో సెంచరీ నమోదు చేసుకున్నాడు.
మైదానం నలువైపులా బంతిని తరలించిన సూర్యకుమార్ టీ20ల్లో మూడో శతకాన్ని, 2023లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఈ మూడు శతకాలు వేగవంతమైనవే కావడం విశేషం. కెప్టెన్గా హార్దిక్ పాండ్యా తొలి సిరీస్ను గెలవడం మరో విశేషం. రెండో టీ20లో నోబాల్స్తో విమర్శల పాలైన పేసర్ అర్ష్దీప్ సింగ్.. ఈ మ్యాచ్తో గాడిన పడటమే కాకుండా.. 3 వికెట్లు తీయడం ఇంకో విశేషం.
శ్రీలంక జట్టులో కెప్టెన్ దాసున్ శనక (23 రన్స్, 17 బంతుల్లో, 2 సిక్స్లు), కుశాల్ మెండిస్ (23 రన్స్, 15 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్లు) చేసినవే అత్యధిక పరుగులు కావడం గమనార్హం. భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆది నుంచే భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించిన లంక జట్లు క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది.
ధనుంజయ డిసిల్వా 22, చరిత్ అసలంక 19, నిస్సాంక 15 పరుగులు చేశారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా.. సారథి హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు, యజ్వేంద్ర చాహల్ 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు.