తమిళనాడు అసెంబ్లీ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ రవి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం చేస్తున్న సమయంలో డీఎంకే సభ్యలు సోమవారం సభలో గందరగోళం సృష్టించారు. నినాదాలు చేస్తూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ జోక్యం చేసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగాన్ని మాత్రమే రికార్డులోకి తీసుకోవాలని, గవర్నర్ తన ప్రసంగంలో కొత్తగా జోడించిన అంశాలను తీసివేయాలని సీఎం స్టాలిన్ స్పీకర్ను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగాన్ని మాత్రమే గవర్నర్ ఒరిజినల్ స్పీచ్గా రికార్డు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు.
దీంతో గవర్నర్ సభ ముగిసే సమయంలో వినిపించే జాతీయ గీతాన్ని వినిపించక ముందే సభ నుంచి వెళ్ళిపోయారు. తమిళనాడు శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగించడం సంప్రదాయం. ఈ ప్రసంగాన్ని ప్రభుత్వం తయారు చేస్తుంది. దీంతో మళ్లీ స్టాలిన్, గవర్నర్ మధ్య వైరం కొత్త స్థాయికి చేరినట్లు అయ్యింది.
ఇటీవల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ రవి మధ్య భిన్నాభిప్రాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ప్రసంగంలో గవర్నర్ రవి.. ద్రవిడ నేతల గురించి ప్రస్తావించలేదు. అంబేద్కర్, ద్రవిడ మోడల్కు చెందిన విషయాలను ఆయన చదవలేదు. ప్రసంగంలో ఉన్న 65వ పేరాకు చెందిన స్పీచ్ను గవర్నర్ విస్మరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ద్రవిడార్ ఖజగం వ్యవస్థాపకుడు పెరియార్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, మాజీ సీఎం కామరాజ్, అన్నాదురైల గురించి ఉన్న వ్యాఖ్యలను గవర్నర్ తన ప్రసంగం సమయంలో స్కిప్ చేశారు. ఈ ఘటన తర్వాతే సీఎం స్టాలిన్ ఆదేశాల మేరకు గవర్నర్ ప్రసంగంపై తీర్మానం చేపట్టారు.
డీఎంకే మిత్రపక్షాలైన కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం లాంటి పార్టీలు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించాయి. బిల్లు క్లియర్ చేయడంలో గవర్నర్ ఆలస్యం చేస్తున్నట్లు ఆ పార్టీలు ఆరోపించాయి. అసెంబ్లీలో ఆమోదం పొందిన 21 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నట్లు డీఎంకే మిత్రపక్షాలు ఆరోపించాయి.
గవర్నర్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో నినాదాలు హోరెత్తాయి. క్విట్ తమిళనాడు అని స్లోగన్స్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని తమపై రుద్ద వద్దు అని డీఎంకే ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.
తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ రవి మధ్య వివాదం గత కొన్ని నెలల నుంచి సాగుతోంది. గవర్నర్ గత వారం మాట్లాడుతూ, దేశం మొత్తానికి వర్తించేదానిని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే ప్రతిదానినీ చెడు అలవాటుతో తిరస్కరించే తిరోగమన రాజకీయాలు రాష్ట్రంలో ఉన్నాయని ఆరోపించారు.
తమిళనాడు పేరును మార్చాలన్నారు. రాష్ట్రానికి తమిళనాడు కన్నా తమిళగం అనే పేరు ఎంతో తగినది అవుతుందని చెప్పారు. తమిళంలో ‘నాడు’ అంటే దేశమని చెప్పారు. ద్రావిడులమని చెప్పుకుంటూ తమిళనాడులో తిరోగమన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను డీఎంకే తదితర పార్టీలు తీవ్రంగా ఖండించాయి. అయితే బీజేపీ మాత్రం గవర్నర్ వ్యాఖ్యలను సమర్థించింది. తమిళనాడు గడ్డను తమిళ సాహిత్యంలో తమిళగం అని, తమిళనాడు అని పేర్కొన్నారని తెలిపింది.