కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు పంపిన నిధులను రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం దారి మళ్ళించడంపై సర్పంచుల సంఘం నాయకులు ఢిల్లీకి వస్తే స్వయంగా కేంద్రానికి ఫిర్యాదు చేద్దామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవిబి రాజేంద్రప్రసాద్, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు శ్రీమతి వానపల్లి లక్ష్మీ ముత్యాలరావుల ఆధ్వర్యంలో సర్పంచ్ లు గ్రామాల సమస్యలపై విజయవాడలో జరిగిన అఖిల పక్షరౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటూ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సర్పంచుల సంఘం చేపట్టే అన్ని ఉద్యమాలకు బిజెపి పార్టీ *గల్లీ నుంచి ఢిల్లీ వరకు* మద్దతుగా నిలుస్తామని వీర్రాజు భరోసా ఇచ్చారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో టిడిపి, బిజెపిలతో సహా వామపక్షాలు, జనసేన, కాంగ్రెస్, బీఎస్పీ తదితర పార్టీల నాయకులు కూడా ఒకే వేదికపైకి వచ్చి సర్పంచ్ లకు, గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై గళం విప్పారు. ఉమ్మడిగా ఈ విషయంలో ప్రభుత్వంపై పోరాటానికి బాసటగా నిలుస్తామని ప్రకటించారు.
బిజెపి, టీడీపీ, జనసేన, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, బిఎస్పీ, జైభీమ్ తదితర పార్టీల నాయకులు పాల్గొంటూ గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు, పంచాయతీల బలోపేతం కొరకు కలసి నడుద్దామని సంసిద్ధతను వ్యక్తం చేశారు.
కేంద్రం పంపిన నిధులను దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకొని సర్పంచులకు నిధులు విధులు అధికారాలు లేకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంపై పోరాడుతున్న సర్పంచులు సంఘానికి అందరూ పూర్తి మద్దతు తెలిపారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, జనసేన పార్టీ నాయకులు బండ్రెడ్డి రాము, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సర్పంచుల నిధులు ,విధులు, అధికారాల సాధన కోసం కేంద్ర ప్రభుత్వం 14,15వ ఆర్థిక సంఘం ద్వారా 12,918 గ్రామాల సర్పంచులకు పంపిన రూ,,8660 కోట్లను తిరిగి సర్పంచుల ఖాతాల్లో జమ చెయ్యాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు.
గ్రామ సచివాలయాలను సర్పంచుల అధ్వర్యంలోకి తీసుకురావాలని, సర్పంచులకు , ఎంపీటీసీ లకు రూ:15 వేలు – అలాగే ఎంపీపీ లకు, జడ్పిటిసి లకు రూ,,30,000 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు.
ఉపాధి హామీ నిధులు కూడా గతంలో మాదిరే సర్పంచులకు ఇవ్వాలని, పాత పద్ధతిలోనే పంచాయతీలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, గత మూడున్నర సంవత్సరములుగా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన గ్రామపంచాయతీల బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ప్రజాక్షేత్రంలో గెలిచిన సర్పంచుల హక్కులు కాలరాస్తున్నదని వారంతా మండిపడ్డారు.