ఆచరణ కాని హామీలు ఇచ్చేందుకు, రాష్ర్ట ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో సంక్షేమ పథకాలు, హామీల గురించి చర్చ జరగదని పేర్కొంటూ కొత్త కొత్త సంక్షేమ పథకాల పేర్లు చెప్పి.. లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతారని ఆరోపించారు.
మహబూబ్ నగర్ లో బిజెపి రెండు రోజుల రాష్ట్రకార్యవర్గ సమావేశాలలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలందరికీ వివరించాలని పార్టీ శ్రేణులకు సంజయ్ పిలుపునిచ్చారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందంటూ మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ర్టంలో జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు స్వేచ్ఛగా పని చేసే పరిస్థితి కూడా లేదని, చివరకు కోర్టు ఆదేశాలను కూడా కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు పూర్తి నిరాశ, నిస్పృహ, ఆందోళనలో ఉన్నారని, ప్రజల్లో ఆత్మవిశ్వాసం, భరోసా కల్పించే పార్టీ బీజేపీ అని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.
అన్ని వర్గాలు, ప్రతిపక్ష పార్టీలను అణిచివేయలన్నదే బీఆర్ఎస్ పార్టీ సిద్దాంతమని చెబుతూ రాష్ట్రంలో మార్పు జరగాల్సిందేనని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీకి జాతీయత లేదని… జాతీయ ప్రణాళిక అసలే లేదని సంజయ్ ఆరోపించారు. ఖమ్మం బహిరంగ సభకు వచ్చిన వారు చెల్లని రూపాయలుగా మిగిలిన వాళ్లే అంటూ ధ్వజమెత్తారు. సభకు వచ్చిన నాయకులు వివిధ స్కామ్ లలో ఉన్నావారే అని ఆరోపించారు. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ నాయకులతో ఖమ్మంలో సభ పెట్టారంటూ తీవ్ర విమర్శలు చేశారు. కేవలం ప్రధాని నరేంద్ర మోదీని తిట్టేందుకే బహిరంగ సభ నిర్వహించారని రాష్ర్ట ప్రభుత్వంపై సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ పాలన రాచరిక పాలన కొనసాగుతోందని, అందుకే రామ రాజ్యం రావాలని ప్రజలు కోరుతున్నారని సంజయ్ తెలిపారు. దళిత బంధు పేరుమీద కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే అమలుచేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాలను నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారని విమర్శించారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 50 వేల ఉద్యోగలకు నోటిఫికేషన్ వేస్తామని మాయమాటలు చెప్పడమే తప్ప ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్లు వేయలేదని దుయ్యబట్టారు. ధనిక రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల రూపాయల అప్పు రాష్ట్రంగా మార్చారని, కాళేశ్వరం పేరుమీదే లక్ష కోట్లు అప్పు చేశారని ఆరోపించారు.