బీఆర్ఎస్, ఆప్ పార్టీల మధ్య బంధానికి ఢిల్లీ లిక్కర్ స్కాం పునాదని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డా. కె. లక్ష్మణ్ ఆరోపించారు. తప్పు చేస్తే చట్టం నుండి ఎవరు తప్పించుకోలేరని, చట్టానికి ఎవరూ అతీతులు కారని ఆయన స్పష్టం చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీటు ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) – భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మధ్య లిక్కర్ బంధం బయటపడిందని ఆయన స్పష్టం చేశారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, తప్పు చేసినవారికి శిక్ష తప్పదని హెచ్చారించారు.
రెండు పార్టీలకు చెందిన కీలక వ్యక్తులు కలిసి కుంభకోణం ఎలా చేశారో, వచ్చిన సొమ్మును గోవా ఎన్నికల్లో ఎలా ఖర్చు చేశారో సవివరంగా చార్జిషీటులో పొందుపరిచారని ఆయన వెల్లడించారు. ఈ అనుబంధంతోనే ఖమ్మంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ హాజరయ్యారని డా. లక్ష్మణ్ గుర్తు చేశారు. ఇదంతా చూస్తుంటే దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.
దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా విచారణ జరుపుతాయని ఆయన భరోసా ఇచ్చారు. ప్రధాని మోదీ మహిళలకు పెద్దపీట వేసి రాజ్యాంగ పదవుల్లో స్థానం కల్పిస్తుంటే.. కేసీఆర్, బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం రాజ్యాంగ పదవుల్లో ఉన్న మహిళలను అగౌరవపరుస్తున్నారని ఆయన మండిపడ్డారు.
బీజేపీ ఒక గిరిజన-ఆదివాసీ ఆడబిడ్డను భారత రాష్ట్రపతిని చేసి, ఒక తెలుగింటి కోడలు నిర్మల సీతారామన్తో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడితే భారత రాష్ట్ర సమితి ఒక మహిళా గవర్నర్నే సహించలేకపోతోందని డా. లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ గవర్నర్ను అడుగడుగునా అవమానిస్తున్నారని, మహిళల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎలా వ్యవహరిస్తున్నాయో ఈ ఉదంతాలే నిదర్శనమని ధ్వజమెత్తారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు రూ. 38 వేల కోట్లు
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు రూ. 38 వేల కోట్లు కేటాయించిందని డాక్టర్ లక్ష్మణ్ వెల్లడించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రూ.10,500 కోట్లు కేటాయించిందని తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ సింగరేణి వంటి సంస్థలకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన చెప్పారు.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం బడ్జెట్ ను ప్రవేశపెట్టామని చెబుతూ రాజకీయాలతో నిమిత్తం లేకుండా రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తుందని స్పష్టం చేశారు. చిన్న, సన్నకారు రైతుల ప్రాధాన్యత పెంచేందుకు హైదరాబాద్ లో మిల్లెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇబ్బంది పడుతుంటే.. అన్ని దేశాలు భారత్ వైపు చూసేలా బడ్జెట్ ప్రవేశపెట్టామని లక్ష్మణ్ కొనియాడాడారు. ప్రపంచదేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయంటే అందుకు మోదీయే కారణం అని స్పష్టం చేశారు.
ముందు చూపుతో భారతదేశం తీసుకున్న చర్యలను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని తెలిపారు. బడ్జెట్ కత్తిమీద సాము లాంటిదని, అయినప్పటికీ అన్ని వర్గాలకు ప్రయోజనాలు కల్పించేలా కేంద్రం రూపొందించిందని అన్నారు. సమీప భవిష్యత్తులో ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని తీసుకెళ్లేలా ఈ బడ్జెట్ ఉందని అన్నారు.