ప్రముఖ సింగర్ వాణీ జయరాం శనివారం కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. చెన్నై నుంగబాకంలోని ఆమె నివాసంలో జారిపడి మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలుగా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారీమె.
1971లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఐదు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. ఆమె సుమారు వేయి సినిమాలలో పది వేల పాటలకు పైగానే పాడారు. సినిమాలతో పాటు వేల సంఖ్యలో భక్తి గీతాలను కూడా ఆమె ఆలపించారు. తెలుగు, తమిళం సహా 19 భాషల్లో ఆమె పాటలు పాడటం విశేషం. మూడుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా అవార్డులను పొందారు. పాడిన తొలి పాటకే ఐదు అవార్డులు వచ్చాయి.
తొలితరం గాయనీమణుల్లో సుశీల, జానకి వంటి హేమాహేమీల సరసన తనకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్న వాణీజయరాం గాత్రం సంగీత భాండాగారం. హిందీ సినిమాలతో ఆమె కెరియర్ ప్రారంభమైనా దక్షిణాది చిత్రాలలోనే ఎక్కువ పాటలు పాడారు. తెలుగులో తక్కువ పాటలే పాడినా అవన్నీ ఆణిముత్యాలే.
వాణీ జయరాం తమిళనాడులోని వెల్లూరులో జన్మించారు. ఎనిమిది మంది సంతానంలో ఐదవ పుత్రికగా ఆమె జన్మించారు. వారి తల్లి వీణా విద్వాంసులు రంగ రామనుజ అయ్యంగార్ శిష్యురాలు. వాణి జయరాం చిన్నతనం నుంచి సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. 8 ఏళ్ల వయసులోనే ఆల్ ఇండియా రేడియో కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆమె పాడిన ప్రతి పాటా ఓ ఆణిముత్యం. ఆమె గొంతు పరిచయం కాని తెలుగువారే కాదు.. భారతీయులే ఉండరు. ఎందుకంటే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఒడిస్సి, భోజ్పురి, హిందీ… మొత్తం 14 భాషల్లో దాదాపు 10 వేల పాటలు పాడిన అద్భుత గానం ఆమెది. ఆమె జీవితమంతా సంగీత సాధనలోనే గడిపారు. ‘సంగీతమంటే సినిమా పాటలే కాదు.. సంగీతమంటే ఓ మహాసముద్రం. ఎంత ఈదినా ఇంకా మిగిలే వుంటుంది’ అని ఎప్పుడూ అనేవారు.
కర్ణాటక సంగీతాన్ని కడలూరు శ్రీనివాస అయ్యంగార్, టి.ఆర్, బాలసుబ్రమణియన్, ఆర్.యెస్ మణి ల వద్ద అభ్యసించగా, హిందుస్తాని సంగీతం ప్రఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ రహ్మాన్ ఖాన్ వద్ద నేర్చుకున్నారు. వివాహానంతరం వాణీ జయరాం ముంబైలో స్థిర పడ్డారు.
అనుకోని విధంగా హిందీ సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ని కలిసిన తర్వాత కెరీర్ మలుపు తిరిగిందనే చెప్పాలి. హృషీకేష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ప్రముఖ హిందీ సినిమా గుడ్డిలో ‘బోలె రే పపీ హరా..’ ద్వారా సినీనేపధ్య గాయకురాలిగా ఆరంగేట్రం చేసి తన చిన్ననాటి కలను నిజం చేసుకున్నారు.