వామపక్షాలు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో త్రిపురలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉండేదని, సీపీఎం కార్యకర్తలు ఏకంగా పోలీస్ స్టేషన్లపైననే దాడులు చేసేవారని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. పోలీస్ స్టేషన్లను చెర పట్టే పరిస్థితి నుంచి న్యాయబద్ధ పాలన కొనసాగే పరిస్థితికి రాష్ట్రాన్ని బీజేపీ తీసుకువచ్చిందని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ శనివారం త్రిపురలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ సీపీఎం, కాంగ్రెస్ ల పాలన లో త్రిపురలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఆరోపించారు. దశాబ్దాలుగా రాష్ట్రంలో అభివృద్ధిని కాంగ్రెస్, సీపీఎం అడ్డుకున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, వామపక్ష కూటమికి ఓటు వేస్తే, మళ్లీ త్రిపుర దశాబ్దాల వెనక్కు వెళ్తుందని ప్రధాని హెచ్చరించారు.
‘గతంలో త్రిపుర అంటే హింసకు పర్యాయపదంగా ఉండేది. గూండాయిజం, అవినీతి రాజ్యమేలేవి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాతనే ప్రగతి పట్టాలపైకి రాష్ట్రం చేరి, పరుగులు తీయడం ప్రారంభించింది’’ అని ప్రధాని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాతే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు.
బీజేపీ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధ్యమైందని చెబుతూ మహిళలు, యువత సహా అన్ని వర్గాలు ప్రగతి పథంలో సాగుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. బీజేపీ మినహా ఏ పార్టీకీ ఓటు వేయవద్దని కోరారు. పాత పార్టీలన్నీ ఇప్పుడు చేతులు కలిపాయి. వేరే కొన్ని పార్టీలు కూడా ఆ కూటమికి పరోక్షంగా సహకరిస్తున్నాయని చెప్పారు.
`వారి మాయలో పడకండి’ అంటూ త్రిపుర ఓటర్లకు ప్రధాని మోదీ వారించారు. సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలోని గిరిజనుల్లో చీలిక తెచ్చాయని, అయితే బీజేపీ వారిలో ఐక్యతకు బీజం వేసిందని ప్రధాని మోదీ చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి వస్తే, డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా కొనసాగుతుందని తెలిపారు.