బీటౌన్లో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందిన నటి కంగనా రనౌత్ తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల కేటాయింపులో నిర్వాహకులు పక్షపాతంతో వ్యవహరించారని మండిపడ్డారు. ముంబైలో సోమవారం రాత్రి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ నటి, బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో ఆలియాభట్, రణబీర్ కపూర్ లకు అవార్డులు వరించాయి.
దీనిపై కంగన ట్విట్టర్ ద్వారా స్పందించారు. నెపోటిజం వల్లే ఆలియా-రణబీర్కు అవార్డులు దక్కాయని విమర్శించారు. అవార్డులు పొందే అర్హత వీరికే ఉందంటూ ఓ జాబితాను ట్విట్టర్ లో ఆమె పంచుకున్నారు.
‘బాలీవుడ్ను నెపోటిజం వదలడంలేదు. అవార్డులు కూడా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికే ఇస్తున్నారు. నెపో మాఫియా కారణంగా మిగతా వారికి అన్యాయం జరుగుతోంది. అర్హులకు అవార్డులు, అవకాశాలు అందట్లేదు. ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకునే అర్హత వీరికే ఉంది’ అంటూ ఓ జాబితాను తన ట్విట్టర్లో షేర్ చేశారు.
‘‘నిజంగా అర్హులైన వారికి అవార్డులు ఇస్తే ఎవరికీ ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. కానీ సోమవారం జరిగిన ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు ఇవ్వడంతో మరోసారి నెపోటిజం బయటపడింది. నెపోటిజం వల్లే వారంతా అవార్డులు దక్కించుకున్నారు. అదొక పెద్ద బూటకం’’ అని కంగనా విమర్శించారు. అంతే కాదు వీలు కుదిరినప్పుడు ఆ అవార్డులకు ఎవరు అర్హులో చెబుతా అంటూ ప్రస్తుతానికి కొందరి పేర్లను చెప్పారు.
గంగూబాయి కథియావాడీ సినిమాకు గానూ ఉత్తమ నటి కేటగిరీలో ఆలియాభట్ అవార్డును అందుకున్నారు. అదేవిధంగా ఆలియా భర్త రణబీర్ కపూర్ కూడా బ్రహ్మాస్త్ర సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డును సొంతం చేసుకున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి రణబీర్ కపూర్ హాజరుకాకపోవడంతో భర్త తరఫున ఆలియానే ఈ అవార్డును కూడా అందుకున్నారు.
అంతర్జాతీయంగా అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అవార్డు సొంతం చేసుకుంది. ఈ అవార్డుల వేడుకల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం ‘ఫిలిం ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కించుకుంది.
కన్నడ చిత్రసీమ నుంచి చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయం అందుకున్న కాంతార సినిమాకు కూడా అవార్డు వచ్చింది. ఈ సినిమాలో నటనకు గానూ మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును రిషబ్ శెట్టి దక్కించుకున్నాడు.