గత 13 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ‘‘స్ట్రీట్ కార్నర్ మీటింగ్’’ ల పట్ల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, సంతృప్తి వ్యక్తం చేశారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు భేష్ అంటూ కితాబిచ్చారు.
పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన ‘‘బూత్ స్వశక్తీకరణ్ అభియాన్’’ వర్క్ షాప్ సందర్భంగా ప్రజా గోస – బీజేపీ భరోసా పేరుతో నిర్వహిస్తున్న స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల తీరుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయా నేతలు మాట్లాడుతూ ‘‘స్ట్రీట్ కార్నర్ మీటింగ్’’ పట్ల ప్రజల్లో సానుకూల చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ సంస్థల నివేదికలు కూడా ఇవే చెబుతున్నాయని తెలిపారు. ఇప్పటికే 6 వేలకు పైగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు పూర్తయ్యాయని, గడువు తేదీలోగా 10 వేలకు పైగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు నిర్వహించాలని కోరారు.
ఈ సందర్భంగా పలువురు జిల్లా అధ్యక్షులు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల గడువు తేదీని పొడిగించాలని ముక్త కంఠంతో కోరారు. సానుకూలంగా స్పందించిన సునీల్ బన్సల్ మరో మూడు రోజులు గడువు పొడిగించారు. ఈనెల 28 నాటికి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లను పూర్తి చేయాలని సూచించారు.
చివరి రోజైన ఆదివారం సాయంత్రం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించాలని ఆదేశించారు. ఒక్కో నియోజకవర్గంలో సగటున 5 వేల మందికి తగ్గకుండా సభలు నిర్వహించి జయప్రదం చేయాలని కోరారు.